Harish Rao | సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అంటూ బీజేపీ కేంద్రం బక్వాస్ మాటలు మాట్లాడుతుందని హరీశ్రావు విమర్శించారు. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలకు ఏపీకి రూ.100 కోట్లను మోదీ ప్రభుత్వం నిధులు మంజూరు చేశారని తెలిపారు. గోదావరి ఎక్కువ భాగం ప్రవహించే తెలంగాణకు మాత్రం ఇచ్చింది గుండు సున్నా అని అన్నారు. తెలంగాణ భారతదేశంలో లేదా? తెలంగాణకు ఎందుకు నిధులు ఇవ్వట్లేలు అని ప్రశ్నించారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారని.. అందులో ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా రాష్ట్రానికి నిదులు ఇవ్వమని ఒక్కరికి కూడా నోరు తెరిచి అడిగే దమ్ము లేదని ఎద్దేవా చేశారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి మాజీ మంత్రి హరీశ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు సమక్షంలో బీజేపీ నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్లో చేరారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ..ఉద్యమకారుడు తానాజీ బీజేపీకి వెళ్లి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నానని అన్నారు. వారితోపాటు చేరిన 150 మంది మాజీ సర్పంచులు, ఎంపీటీసీలకు బీఆర్ఎస్ తరపున స్వాగతం పలుకుతున్నానని అన్నారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టత వచ్చేసిందని.. మల్లొచ్చే ప్రభుత్వం ఏదని ఎవరిని అడిగినా బీఆర్ఎస్ పక్కా అని అంటున్నారని తెలిపారు. రెండేళ్లు గడిచిపోయింది, ఉన్నది ఇంకా రెండేళ్లు. మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ దేశం కోసం ధర్మం కోసం అంటూ డైలాగులు కొట్టిందని.. మోదీ ఏమో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటారని హరీశ్రావు తెలిపారు. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అంటే సబ్కా వికాస్ కాదు ఓ పూర బక్వాస్ అని విమర్శించారు. బీజేపీ పేద ప్రజల, రైతుల పక్షాన ఉండదని అన్నారు. దళితుల పక్షాన ఉండదన్నారు. కేవలం నార్త్ ఇండియా వైపే ఉంటుందని తెలిపారు. తెలంగాణ దేశంలో భాగం కాదా? ఎందుకు తెలంగాణకు నిధులు ఇవ్వరు అని ప్రశ్నించారు. జాతీయ పార్టీలు తెలంగాణకు అన్ని విధాల అన్యాయాలే చేస్తాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు.
నిజాంబాద్ జిల్లా కందకుర్తి దగ్గర గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశిస్తుందని హరీశ్రావు అన్నారు. తెలంగాణ గుండా ప్రవహించి ఆంధ్రాలో కలుస్తుందని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలకు ఇదే బీజేపీ ఆంధ్రాకు 100 కోట్లు ఇచ్చిందన్నారు. 8 ఎంపీలను గెలిపించిన తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిందని తెలిపారు. తెలంగాణలో గోదావరి నది లేదా? ఎందుకు గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వడం లేదని బీజేపీని ప్రశ్నించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి, ప్రాంతీయ పార్టీ కాబట్టి ఢిల్లీ మెడలు వంచిందని అన్నారు. అదే తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచి ఉంటే ఢిల్లీలో బీజేపీ మెడలు వంచి నిధులు తీసుకొని వచ్చేదని తెలిపారు. 157 మెడికల్ కాలేజీలను కేంద్రం ప్రకటిస్తే ఒక్క మెడికల్ కాలేజ్ తెలంగాణకు ఇవ్వలేదని ఆరోపించారు. పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ ఎదిగిందని గుర్తుచేశారు.
కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చిండు.. రైతుబంధు పథకం తెచ్చిండు.. మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసిండు అని కేసీఆర్ తెలిపారు. ఈరోజు ప్రాజెక్టులు కట్టింది కేసీఆర్ అని పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసింది కేసీఆర్ అని.. పండించిన ప్రతి గింజను కొన్నది కేసీఆర్ అని తెలిపారు. 2014లో బీజేపీ ఢిల్లీలో వచ్చిందని తెలిపారు. గోధుమలకు వరికి మద్దతు ధర 2014లో 1400 ఉండే.. గోధుమల మద్దతు ధరను 169 రూపాయలు కేంద్రం మొన్న పెంచిందన్నారు. ఈరోజు గోధుమల మద్దతు ధర 2585 రూపాయలు అయ్యిందని అన్నారు. వడ్లకు 2369 రూపాయలు అని తెలిపారు. 216 రూపాయలు వడ్ల కంటే గోధుమలకు ఎక్కువ మద్దతు ధర ఇచ్చిందని పేర్కొన్నారు. వాళ్ల దగ్గర పండే గోధుమలకు ఎక్కువ మద్దతు ధర ఇచ్చి మన దగ్గర పండే వరికి మద్దతు ధర తగ్గించారని తెలిపారు. ఇప్పుడు ఎకరా మీద తెలంగాణ రైతు ఆరేడువేల రూపాయలు నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు ఇలా ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోయి ఉంటారని చెప్పారు. ఇదేనా బీజేపీ చెప్పిన సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ప్రశ్నించారు. 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు బీజేపీ అధిష్టానానికి ఎదురు మాట్లాడే దమ్ముందా అని నిలదీశారు. అదే బీఆర్ఎస్ ఉంటే మన హక్కుగా వచ్చే నిధులను తెలంగాణకు తెచ్చేవాళ్లని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎందుకు ఇవ్వరని హరీశ్రావు ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా, మెడికల్ కాలేజీలు గుండు సున్నా, నవోదయ విద్యాలయాలు గుండు సున్న, చివరికి వడ్లకు మద్దతు ధర ఇయ్యమంటే మొండి చెయ్యి అని మండిపడ్డారు. బీజేపీకి ఓటేసినందుకు ఒక్కొక్క రైతు ఎకరానికి 7000 రూపాయలు నష్టపోతున్నారని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటే, పరిశ్రమలు పెట్టాలంటే నిధులు ఇయ్యరు. రైల్వే లైన్లకు నిధులు ఇవ్వరు. హైవే కోసం నిధులు ఇవ్వరని అన్నారు. ఐదేళ్ల నుంచి రీజినల్ రింగ్ రోడ్డుకి నిధులు ఇవ్వడం లేదన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రేపు తెలంగాణకు నిధులు రావాలంటే మన వాటా మనకు రావాలంటే మన ప్రాధాన్యత కోసం ఎంపీలను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.