ఆదిలాబాద్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త కంది శ్రీనివాస్రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత ఎలా ప్రచారం చేస్తారని ఆదిలాబాద్ డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ఖాన్ ప్రశ్నించారు. శుక్రవారం ఆదిలాబాద్లో టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, సీనియర్ నాయకుడు సంజీవరెడ్డితో కలిసి సాజిత్ఖాన్ మీడియాతో మాట్లాడారు. పార్టీ జెండా మోసిన వారికి, ఏఐసీసీ, పీసీసీ కార్యక్రమాలు విజయవంతం చేసిన వారికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇంటికి పంపుతామని, దేశంలో ఆర్ఎస్ఎస్తో కొట్లాడుతున్న వ్యక్తిని తాను ఒక్కడినేనని, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారికి, ప్యారాచ్యూట్లకు టికెట్లు ఇవ్వబోమని పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆదిలాబాద్ టికెట్ విషయంలో పార్టీ అగ్రనేత మాటలు ఏమయ్యాయని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తకు టికెట్ ఎలా ఇస్తారని? కాంగ్రెస్ సిద్ధాంతాలను ఎందుకు మంట గలిపారని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ఎంతమంది ముస్లింలకు టికెట్లు ఇచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్గాంధీ ప్రధాని కావాలని ముస్లింలు కోరుకుంటున్నారని అలాంటి నాయకుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త తరఫున ఎలా ప్రచారం చేస్తారో అగ్రనేత ఆలోచించుకొని, వెంటనే ఆదిలాబాద్ ప్రచారాన్ని రద్దు చేసుకోవాలని కోరారు.