ఖైరతాబాద్, ఫిబ్రవరి 11: గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోదీ ప్రధాని అయినప్పుడు తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రధానమంత్రి ఎందుకు కాకూడదని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ప్రశ్నించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లోని పీవీ మార్గ్లోని పీపుల్స్ప్లాజాలో మీడియాతో మాట్లాడుతూ.. మోదీకి పదవి పోతుందేమోనన్న భయం పట్టుకున్నదని అన్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న మత రాజకీయాలను పారదోలేందుకు సీఎం కేసీఆర్ ప్రధాని కావాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే ఆ పార్టీ నాయకుల ఇండ్లను సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధాని మోదీ అవహేళన చేయడాన్ని నిరసిస్తూ 14న బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని, గన్పార్క్ వద్ద నుంచి బయలుదేరి వెళ్తామని చెప్పారు. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ మాట్లాడుతూ పార్లమెంటులో ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు యాదృచ్ఛికం కాదని, ఆయన నరనరాన తెలంగాణ వ్యతిరేకత ఉన్నదని చెప్పారు.