హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): మొన్నకిమొన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. అంతకుముందు పలువురు సెలబ్రిటీల అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్, టెస్లా కింగ్ ఎలాన్ మస్క్ కూడా బాధితులే. అసలు సోషల్ మీడియా సురక్షితమేనా? అకౌంట్లు ఎందుకు హ్యాక్కు గురవుతున్నాయి? 2 స్టెప్ వెరిఫికేషన్, ఓటీపీ లాగిన్ వంటి సెక్యూరిటీ లేయర్స్ కూడా అకౌంట్లను ఎందుకు సురక్షితంగా ఉంచలేకపోతున్నాయి. అంటే.. హ్యాకర్లకు సాంకేతిక లోపాలే అస్ర్తాలు అని టెక్ నిపుణులు చెప్తున్నారు. ఫిషింగ్ ట్రాప్ కూడా యూజర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నదని అంటున్నారు. హ్యాకర్లు సాఫ్ట్వేర్లో ఉండే టెక్నికల్ లూప్హోల్స్ను వెతుకుతూనే ఉంటారు. వాళ్లకు ఒక లోపం దొరికిందో.. మొత్తం వ్యవస్థనే ఆగమాగం చేసేస్తారు.
ఫిషింగ్ ట్రాప్తో హ్యాకర్లు యూజర్ల ఐడీని హ్యాక్ చేయవచ్చు. హ్యాకర్లు కాల్, మెసేజ్ ద్వారా ఫిషింగ్ లింక్ను షేర్ చేస్తారు. ఆ లింక్పై మనం క్లిక్ చేయగానే సోషల్ మీడియా లాగిన్ అడుగుతారు. వాళ్లు చెప్పినట్టు లాగిన్ అయ్యామో.. మన ఐడీ, పాస్వర్డ్ను చోరీ చేస్తారు.
హ్యాకింగ్కు గురికాకుండా ఉండాలంటే యూజర్లు అప్రమత్తంగా ఉండటం కీలకం. మన సోషల్ మీడియా అకౌంట్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదు. తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చి మీ ఓటీపీ వివరాలు అడిగితే ఇవ్వకూడదు. ఫిషింగ్ లింక్ల నుంచి అప్రమత్తంగా ఉండాలి.