మోర్తాడ్, ఆగస్టు 1: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పూడిక తొలగింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. 112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఎస్సారెస్పీ పూడిక కారణంగా ప్రస్తుతం 80 టీఎంసీలకు పడిపోయిందని చెప్పారు. పూడిక తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రాధాన్యమిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును మంత్రులు శ్రీధర్బాబు, వివేక్ వెంకటస్వామితో కలిసి ఉత్తమ్ శనివారం సందర్శించారు.
ఎస్సారెస్పీలో నీటిమట్టాన్ని పరిశీలించి, ప్రాజెక్టు అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్ట్లో నీటి నిల్వను బట్టి ఆయకట్టు పంటలకు ఏ మేరకు నీటిని విడుదల చేయాలనే దానిపై రెండురోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత మూడు సంవత్సరాలతో పోలిస్తే ఎస్సారెస్పీలో ఈసారి కొంత తక్కువ మేరకే నీటి నిల్వలు ఉన్నందున ఆయకట్టు రైతులు గమనించి పంటలు సాగుచేయాలని సూచించారు.