హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో వ్యవసాయం కుంటుపడుతున్నది.. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరం కూడా సాగు విస్తీర్ణం పెరగలేదు..’ ఇదీ కొంతకాలంగా బీజేపీ నేతలు సాగిస్తున్న విష ప్రచారం. అయితే, గత ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో పెరిగిన విద్యుత్తు పీక్ డిమాండ్ గణాంకాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. బీజేపీ నేతలు చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని తేలిపోతున్నది. వ్యవసాయ సాగు భూములు లేని జీహెచ్ఎంసీ పరిధిలో గత ఎనిమిదేండ్లలో విద్యుత్తు పీక్ డిమాండ్ పెరుగుదల 33 శాతం మాత్రమే ఉండగా, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో వందశాతం పైగా నమోదైంది. మెదక్లోనూ 92 శాతం పెరిగింది. సాగుభూములు లేని జీహెచ్ఎంసీలో పీక్ డిమాండ్ తక్కువగా పెరగడం, వ్యవసాయ ఆధారిత జిల్లాలు, ప్రాంతాల్లో విద్యుత్తు పీక్ డిమాండ్ అనూహ్యంగా పెరగడం దేనికి సంకేతం? సాగు విస్తీర్ణంలో పెరుగుదలకు నిదర్శనం కాదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 19.03 లక్షలుగా ఉన్న వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల సంఖ్య 2022 ఏప్రిల్ ఒకటి నాటికి 26.45 లక్షలకు పెరిగాయంటే దాని అర్థం ఏమిటి?
రాష్ట్రంలో 110 శాతం పెరిగిన గరిష్ఠ విద్యుత్తు డిమాండ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 2014-15లో 6,755 మెగావాట్లుగా ఉన్న విద్యుత్తు పీక్ డిమాండ్.. గత ఎనిమిదేండ్లలో 14,160 మెగావాట్లకు చేరింది. అంటే 110% పెరుగుదల నమోదైంది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 138 శాతానికి చేరింది. ఆ జిల్లాలో 2014-15లో 663 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదవ్వగా.. 2021-22 (జూలై చివరి) నాటికి 1,576 మెగావాట్లకు చేరింది. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా వంద శాతానికిపైగా విద్యుత్తు డిమాండ్ పెరిగింది. ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోనూ 60% కంటే ఎక్కువగానే విద్యుత్తు పీక్ డిమాండ్ పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో మాత్రం అత్యల్పంగా 33% పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో పరిశ్రమలు, వాణిజ్య, గృహ రంగాల్లో మాత్రమే పెరుగుదల ఉన్నది. జీహెచ్ఎంసీ పరిధిలో వ్యవసాయ సాగు లేకపోవడంతో అతి తక్కువ పెరుగదల నమోదైందని విద్యుత్తు శాఖాధికారులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని ఉమ్మడి జిల్లాల్లో వ్యవసాయసాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో ఆ మేరకు విద్యుత్తు పీక్ డిమాండ్ పెరిగిందని చెప్తున్నారు.
ఏటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
వ్యవసాయరంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యల కారణంగా గత ఎనిమిదేండ్లలో సాగునీరు, భూగర్భ జలాల లభ్యత పెరగడంతో బీడు భూములను సైతం రైతులు సాగుచేస్తున్నారు. దీనితో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. గత ఎనిమిదేండ్లలో సాగు విస్తీర్ణం సుమారు 70 లక్షల ఎకరాలకు పైగా పెరగడం విశేషం. అత్యధికంగా 2020-21లో 203.80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయని వ్యవసాయశాఖ గణాంకాలు చెప్తున్నాయి. 2014-15 సాగు విస్తీర్ణంతో పోల్చుకుంటే.. 2020-21లో అత్యధికంగా 55 శాతం పెరుగుదల నమోదైంది. సాగు విస్తీర్ణంతోపాటు బోర్లు, బావుల దగ్గర విద్యుత్తు మోటర్ల వినియోగం సైతం పెరిగింది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణంతోపాటు ఆ మేరకు విద్యుత్తు పీక్ డిమాండ్ కూడా పెరుగుతూ వస్తున్నది.
రాష్ట్రంలో పెరిగిన వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు
గత ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు కూడా సుమారు 7.42 లక్షలు పెరగడం విశేషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 2014 జూన్ 2 నాటికి 19.03 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. 2022 ఏప్రిల్ ఒకటి నాటికి ఈ సంఖ్య 26.45 లక్షలకు పెరిగింది. రాష్ట్రంలో అన్ని రకాల విద్యుత్తు కనెక్షన్లు 2014లో 1.11 కోట్లు ఉండగా 2022 ఏప్రిల్ ఒకటి నాటికి 1.71 కోట్లకు చేరుకున్నాయి. మొత్తంగా సుమారు 60 లక్షల విద్యుత్తు కనెక్షన్లు పెరిగాయి. ఈ గణాంకాలన్నింటినీ పరిశీలిస్తే.. రాష్ట్రంలో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నదని, అందుకు అనుగుణంగానే విద్యుత్తు డిమాండ్ కూడా పెరుగుతున్నదని అర్థమవుతున్నది.