హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సాగునీటిశాఖ ఆధ్వర్యంలో 6వేల ఎకరాల్లో హరితహారం కార్యక్రమం కింద కోటి మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధం కావాలని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఆదేశించారు. అదేవిధంగా కాలువల వెంట మొత్తంగా 10వేల కిలోమీటర్ల పొడవున అవెన్యూ ప్లాంటేషన్ను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో జలసౌధలో బుధవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులతోపాటు, హరితహారం ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రజత్కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో ఈ ఏడాది ఇరిగేషన్ శాఖను అగ్రస్థానంలో నిలపాలని అధికారులకు సూచించారు. మొత్తంగా 6వేల ఎకరాల్లో అడవులను పెంచాలని నిర్ణయించారు.
అదేవిధంగా ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కాలువల వెంట మొత్తంగా 10వేల కిలోమీటర్ల పొడవునా అవెన్యూ ప్లాంటేషన్ను చేపట్టాలని సూచించారు. వర్షాలు కురవగానే మొక్కలు నాటేందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, నాగేందర్రావు, చీఫ్ ఇంజినీర్లు, పలువురు ఎస్ఈలు పాల్గొన్నారు.