వనపర్తి : వనపర్తి జిల్లాలో అమలవుతున్న సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కాలువల పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు.
మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో చెరువులు, కాలువల పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పుష్కలంగా నీటి వనరుల లభ్యత ఉంది. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలుస్తున్నదని ఆయన తెలిపారు.
జిల్లాలో అమలవుతున్న ప్రాజెక్టుల పనులు, చెరువులు, కాలువల పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి పనుల పురోగతి వివరాలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లో జాప్యం లేకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్ఈ సత్యశీలారెడ్డి, ఈఈ మధుసూధన్, డీఈలు, తదితరులు పాల్గొన్నారు.