హైదరాబాద్, మే 24: నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పురోగతిపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం అరణ్య భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్యాకేజీ 27, 28, సదర్మాట్ బ్యారేజీ, చెక్ డ్యామ్ నిర్మాణాలు, చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు.
గతేడాది కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాల్లో 110 చెరువులు, కుంటలకు గండ్లుపడ్డాయని, వాటి పునరుద్ధరణ పనులు ఎంత వరకు వచ్చాయని మంత్రి ఆరా తీశారు. ఇప్పటికి 28 చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులు పూర్తి అయ్యాయి, మిగతా పనులు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ..సాధ్యమైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేసి పంటలకు సాగునీరు అందేలా చూడాలన్నారు.
ప్రస్తుతం 150 కోట్లతో 25 చెక్ డ్యాం (నిర్మల్ జిల్లాలో 23, మంచిర్యాల జిల్లా జన్నారం పరిధిలో 2)ల నిర్మాణానికి ఎస్టిమేట్స్ సిద్ధం చేసి టెండర్లు వేయాలని మంత్రి ఆదేశించారు. ప్యాకేజీ-27 ద్వారా జూలై లోగా చెరువులకు నీళ్లు అందించేలా నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సదర్మాట్ బ్యారేజ్ గేట్ల బిగింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ప్యాకేజీ- 28 లో కాంట్రాక్టర్ పనులు చేపట్టకపోవడంతో పాత టెండర్లను రద్దు చేసి, కొత్తగా టెండర్లు చేపట్టే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ముధోల్ నియోజకవర్గంలోని గుండెగాం ముంపు సమస్యను త్వరగా పరిష్కరించాలని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ..వెంటనే పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) మురళీధర్, ఉమ్మడి ఆదిలాబాద్ ఇంచార్జ్ సీఈ ఎన్, వెంకటేశ్వర్లు, ఎస్ఈ సుశీల్ కుమార్, ఈఈ రామారావు, తదితరులు పాల్గొన్నారు.