Heavy Rains | భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అప్రతమతంగా ఉందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. కడెం ప్రాజెక్టులో రెండు గేట్లు మొరాయించాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేసి పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. డ్యామ్ ఎత్తు 700 అడుగులు అయితే.. 702 అడుగుల మేర నీటి ప్రవాహం ఉందని తెలిపారు. గతేడాది 706 అడుగుల మేర నీరు ప్రవహించిందని, ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు.
బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఇవాళ 8 గంటల వరకు ములుగులో అత్యధికంగా 650 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. ఇంత పెద్ద మొత్తంలో వర్షాపాతం నమోదవడం ఇదే తొలిసారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్లో అత్యధిక వర్షపాతం నమోదైందని, నీటిపారుదల శాఖ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని చెప్పారు. మిషన్ కాకతీయ ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని, మిషన్ కాకతీయతో చెరువుల పూడికతీతతో ఇంత భారీ వర్షాలు వరదలతో పెద్దగా గండ్లు పడడం లేదన్నారు. ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చిన కేవలం 100లోపు చెరువులు మాత్రమే గండ్లు పడ్డాయని తెలిపారు. గోదావరి నదిలో వరద ఎక్కువగా ఉందని, జిల్లా కేంద్రాల్లో నీటిపారుదల శాఖ ప్రత్యేకంగా ఇంజినీర్లను నియమించినట్లు చెప్పారు. కడెంలో వరద ఎక్కువగా ఉందని, ప్రస్తుతం ఇన్ఫ్లో తగ్గిందన్నారు. రాబోయే కొద్దిగంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్యామ్లపైకి వెళ్లి సెల్ఫీ తీసుకోవద్దని సూచించారు.
భద్రాచలం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుందని రజత్కుమార్ తెలిపారు. అక్కడ సైతం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లోని నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచామన్నారు. ఆర్మీని అక్కడ అందుబాటులో ఉంచుతామని, సాయంత్రం భద్రాచలానికి హెలికాప్టర్ పంపున్నట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు ఎత్తి ఉంచాలని చెప్పామని, గోదావరి నదిలో వరద ప్రవాహం తగ్గే అవకాశాలున్నాయని వివరించారు.