రేవంత్రెడ్డి 2014లో కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని హకీంపేటలో స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సుమారు 16 ఎకరాల భూమిని ఇప్పించారు. అందులో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు నడుస్తున్నాయి.
ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత హకీంపేటలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూ ములను గుంజుకుంటున్న సంగతి తెలిసిందే. భూసేకరణలో భాగం గా స్కూల్ కాంప్లెక్స్కు చెందిన ఆరు ఎకరాలకు కూడా పరిహారం మంజూరైంది.
ప్రభుత్వ భూమికి పరిహారం ఎందుకు వస్తుందని అనుకుంటున్నారా? అదే మ్యాజిక్కు. ఆ భూమి ముగ్గురు రైతులదని, నకిలీ రికార్డులు సృష్టించి వారి పేర్ల మీద రూ.1.20 కోట్లు కొట్టేసేందుకు ‘షాడో’గా మారిన వంటమనిషి ప్లాన్ చేశాడు. ప్రస్తుతం పంపకాలపై చర్చలు జరుగుతున్నాయట.
మహబూబ్నగర్, ఆగస్ట్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గ పరిధి హకీంపేటలోని మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్లో అక్రమాలు, ‘షాడో’ లీలలు తవ్వినకొద్దీ బయటపడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ భూమికి విస్తీర్ణం పెంచి, నకిలీ రైతులను సృష్టించిన వైనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా అంతకుమించిన అక్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది. రేవంత్రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్కూల్ కాంప్లెక్స్కు ఇప్పించిన ప్రభుత్వ భూమిని ఇప్పటి భూసేకరణలో పోతున్నట్టు సృష్టించి, పరిహారం కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. ఈ స్కామ్లో ఓ కాంగ్రెస్ నేత కీలక పాత్ర పోషించారని, ఆయన ముఖ్యనేత ఇంట్లో వంటమనిషిగా వ్యవహరించిన షాడో సోదరుడని చెప్తున్నారు. అక్షరాలా రూ.1.20 కోట్ల విలువైన ఈ కుంభకోణంలో రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకోసం జరుగుతున్న భూ సేకరణలో కోట్లు కూడగట్టిన షాడో కన్ను స్కూల్ కాంప్లెక్స్లో ఖాళీగా ఉన్న జాగపై పడింది. వెంటనే ఆ భూమిని కూడా భూసేకరణ జాబితాలో చేర్చారు. స్కూల్కాంప్లెక్స్లో ఖాళీగా ఉన్న ఆరు ఎకరాలు ఈ కారిడార్లో పోతున్నట్టు సృష్టించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముగ్గురు రైతుల పేరుమీద ఆ భూములు ఉన్నట్టు నకిలీ రికార్డులు తయారు చేశారని తెలిపారు. అనసూయ, కట్టిక ఉసేనమ్మ, నర్సింహులు పేర్ల మీద రెండు ఎకరాల చొప్పున భూములు ఉన్నట్టు బుకాయించారని పేర్కొన్నారు. దీంతో ఎకరాకు రూ.20 లక్షల చొప్పున మొత్తంగా రూ.1.20 కోట్లు మంజూరైందని చెప్పారు. వారికి 6 ప్లాట్లు కూడా కేటాయించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ డబ్బు పంచుకొనే విషయంలో అక్రమార్కుల మధ్య బేరసారాలు నడుస్తున్నాయని సమాచారం.
నకిలీ రైతులు ముగ్గురికి కొంత ఇచ్చి, మిగతా పరిహారం కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. పరిహారం పంచుకొనే విషయంలో తేడాలొచ్చాయని, అందుకే చెక్కుల జారీ ఆగిందని సమాచారం. హకీంపేటలో అధికారులు కనీసం విచారణ చేపట్టకుండా, సర్వేలు చేయకుండా, గుడ్డిగా నోటిఫికేషన్ వేసి, షాడో చెప్పిన విస్తీర్ణం లెక్కలు రాసుకొని వచ్చారని, భారీ ఎత్తున నకిలీ రైతులను సృష్టించడంలో సహరించారని స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
అక్రమార్కులు, అధికారులు కలిసి కోట్లు కొల్లగొట్టారని మండిపడుతున్నారు. ప్రభుత్వ భూములు, సర్కార్ విద్యాసంస్థలకు ఇచ్చిన స్థలాలకు పరిహారం పొందడాన్ని చూస్తుంటే, చివరికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇంటిని కూడా పరిహారం జాబితాలో చేర్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేస్తున్నారు.
రేవంత్రెడ్డి 2014లో కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో హకీంపేటలోని ప్రభుత్వ పాఠశాలల నిర్మాణానికి వృథాగా ఉన్న ప్రభుత్వ భూములను కేటాయించాలని ఆ గ్రామ సర్పంచ్ ర్యాకం యాదయ్య విజ్ఞప్తి చేశారు. దీనికి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించి, భూమిని కేటాయించాలని అప్పటి ఆర్డీవో, తహసీల్దార్కు సిఫార్సు చేశారు. అంతేగాకుండా పట్టుబట్టి తొలి విడతగా 16 ఎకరాలు ఇప్పించారు. రెవెన్యూ అధికారులు హకీంపేటలోని సర్వేనంబర్ 252 /67/1లో ఉన్న ఆ 16 ఎకరాల స్థలాన్ని స్కూల్కాంప్లెక్స్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, జూనియర్, డిగ్రీ కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, క్రీడా ప్రాంగణాల కోసం దీన్ని కేటాయించారు.
రేవంత్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల నిర్మాణాలు జరిగాయి. పట్నం నరేందర్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జూనియర్ కాలేజీ, బీసీ హాస్టల్, తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రాంగణంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ భవనాల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. ఇక్కడే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొనసాగుతున్నది. మొత్తంగా 16 ఎకరాల్లో దాదాపు 8-10 ఎకరాల్లో వివిధ భవనాలు నిర్మాణమై ఉన్నాయి. రెండు ఎకరాల క్రీడా ప్రాంగణంతోపాటు మరికొంత స్థలం ఖాళీగా ఉన్నది.
హకీంపేట పారిశ్రామికవాడ ఏర్పాటుకోసం చేపట్టిన భూసేకరణలో చోటుచేసుకొన్న భారీ అక్రమాలను ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో బయటపెట్టడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. 10 రోజులుగా వస్తున్న వరుస కథనాలతో ప్రభుత్వం ఉలిక్కిపడ్డట్టు సమాచారం. తహసీల్దార్ మొదలు ఉన్నతాధికారుల వరకు ఆరోపణలు రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు చెప్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో గుట్టుగా విచారణ జరుపుతున్నట్టు తెలుస్తున్నది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం వికారాబాద్ కలెక్టరేట్కు వెళ్లిందని, హకీంపేటకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను పరిశీలించే పనిలో పడిందని సమాచారం.
మరోవైపు హకీంపేట మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ పనులను షాడోకు అప్పగించి తప్పు చేశామా? అనే భావన కాంగ్రెస్ నేతల్లో కలుగుతున్నది. ముఖ్యనేత పేరు చెప్పుకొంటూ రూ.కోట్ల కుంభకోణాలకు పాల్పడుతున్న షాడోపై, అతని సోదరులపై పార్టీపరంగా చర్యలు తీసుకోకపోతే భారీనష్టం తప్పదని హెచ్చరిస్తున్నారట. ఈ అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని, సహకరించిన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని, షాడోపై, అతని సోదరుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.