CM Camp Office | హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం ముందు గురువారం కంచెను తొలగిస్తున్న దృశ్యాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. కంచె తొలగించటాన్ని కొత్త ప్రభుత్వం గొప్పగా చెప్పుకొన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన కంచెను తాము తొలగించినట్టు ప్రకటించుకొన్నది. నూతన సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ‘ప్రగతిభవన్ ముందున్న కంచెను తొలగించాం. ఇక నుంచి అది ప్రగతిభవన్ కాదు.. ప్రజాభవన్. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి జ్యోతిబాపూలే ప్రజాభవన్గా మారుస్తున్నాం. అక్కడ ప్రజాదర్బార్ కొనసాగుతుంది’ అని ప్రకటించారు. అయితే ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రగతిభవన్ ముందు తొలగిస్తున్న, తొలగించిన దృశ్యాలు ప్రసారమయ్యాయి. అదే సమయంలో అసలు ప్రగతిభవన్ ముందు ‘ముళ్ల కంచె వేసిందే కాంగ్రెస్ హయాంలో’ అంటూ అసలు విషయాన్ని అదే ప్రసార మాధ్యమాలు బయటపెట్టాయి.
2012 అక్టోబర్ నాటి వీడియోలో హైదరాబాద్లోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ కార్యాలయం ముందు స్పష్టంగా కనిపిస్తున్న ఐరన్ ఫెన్సింగ్
తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ముందున్న ఐరన్ గ్రిల్స్, ఫెన్సింగ్ను గురువారంనాడు తొలగిస్తున్న సిబ్బంది
ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్ (కొత్తపేరు ప్రజాభవన్) ముందు కాంగ్రెస్ హయాంలోనే కంచె మొలిచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులు అనేక ముట్టడి కార్యక్రమాలకు పిలుపునివ్వటం, సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి బయలుదేరిన అనేక సందర్భాల్లోనూ ముళ్లకంచె ఎదురయ్యేది. భారీ పోలీసు భద్రతా ఏర్పాట్ల దృశ్యాలు కోకొల్లలు. ‘అనుమతిలేనిదే లోనికి వెళ్లకూడదు.. లోనికి వెళ్లందే అనుమతి లభించదు’ అనే రీతిలో సీఎం క్యాంపు ఆఫీస్ (ప్రగతిభవన్) ముందు వాతావరణం ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కంచె మొలిచిందని గురువారం సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.
ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోకి వెళ్లే ప్రతీ వాహనాన్ని, వాహనం లో ఉన్నవాళ్లను తనిఖీ చేశాకే లోపలికి పంపిస్తున్న 2012 నాటి వీడియో క్లిప్పులు మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్ర సాధన అనంతరం ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని సుందరీకరించారు. ఈ క్రమంలో ముందున్న కంచెను పటిష్ఠం చేశారు. అంతేకాకుండా ఎండనక.. వాననక అక్కడ విధులు నిర్వహించే భద్రతా సిబ్బంది కోసం షెడ్వేసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి మరమ్మతులు వంటి విషయాలపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంలో సీఎం హోదాలో కేసీఆర్ స్పష్టంగా వెల్లడించారు. ప్రగతిభవన్ కేసీఆర్ సొంతభవనం కాదని, అది తెలంగాణ ప్రజల ఆస్తి అని ఆయన స్పష్టం చేయటం విశేషం.
ప్రగతిభవన్ను రూ.36 కోట్లు పెట్టి కట్టినం అధ్యక్షా.. కేసీఆర్ తరువాత దాంట్లో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటరు అధ్యక్షా..? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం అది. కేసీఆర్ నివాసం కాదు. కేసీఆర్ సొంతభవనం కాదు. తెలంగాణ ప్రజల ఆస్తి.
– అసెంబ్లీలో కేసీఆర్