హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) విజిలెన్స్ విభాగ ఎస్పీగా ఐపీఎస్ అధికారి డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బస్ భవన్లోని తన ఛాంబర్లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ములుగు ఎస్పీగా ఉన్న ఆయనను టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా ప్రభుత్వం ఇటీవల నియమించింది.
పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్కు సజ్జనార్ శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ అభివృద్ధి కోసం మంచి ఐపీఎస్ అధికారిని నియమించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. స్వయంగా డాక్టర్ అయిన సంగ్రామ్ సింగ్ సేవలను తార్నాక ఆస్పత్రిలో సౌకర్యాలను మరింతగా మెరుగుపరచడానికి, సిబ్బంది సంక్షేమానికి వినియోగించుకుంటామని సజ్జనార్ తెలిపారు. పోలీసింగ్ లాగానే ఆర్టీసీ కూడా ప్రజా సేవే అని గుర్తు చేశారు. ములుగు, భూపాలపల్లి ఎస్పీగా ఉన్నప్పుడు ఆదివాసీలకు సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ చేసిన వైద్య సేవలను మెచ్చుకున్నారు. మేడారం జాతర సమయంలో పోలీస్ శాఖకు టీఎస్ఆర్టీసీ పూర్తిగా సహకరించిందిదని, దాని వల్ల అతి పెద్ద గిరిజన జాతర విజయవంతంగా జరిగిందని గుర్తు చేశారు. త్వరలోనే సంస్థకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయని, సంస్థ వృద్ధికి నిబద్ధతతో పనిచేయాలని సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ కి సూచించారు.
టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా తనను నియమించిందుకు ఈ సందర్బంగా ప్రభుత్వానికి సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ వృద్దికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఆర్టీసీ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
మహారాష్ట్రలోని పండరీ పూర్కు చెందిన సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తెలంగాణ కేడర్కు చెందిన ఆయన మొదట భద్రాచలం ఏఎస్పీగా పని చేశారు. గత నాలుగేళ్లుగా ములుగు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. జయశంకర్ – భూపాలపల్లి జిల్లాకు దాదాపు రెండేళ్లు ఇంచార్జీ ఎస్పీగా కొనసాగారు. ఆయన ములుగు ఎస్పీగా ఉన్నప్పుడే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం 2020, 2022లో రెండు సార్లు జరిగింది. జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకున్నారు. అతి తక్కువ కాలంలోనే సమర్థవంతమైన అధికారిగా పోలీస్ శాఖలో పేరు తెచ్చుకున్నారు. స్వయంగా డాక్టర్ అయిన సంగ్రామ్ సింగ్ జీ పాటిల్.. ఏజెన్సీలోని ఆదివాసులకు శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సహాయం అందించారు. 15 రోజులకోసారి ఏజెన్సీలోకి వెళ్లి స్వయంగా వైద్యం అందించారు. పోలీసింగ్లో చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వ అంత్రిక్ సేవా పతకం సంగ్రామ్ సింగ్ను వరించింది.