హైదరాబాద్ : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజినల్ ఔజ్ రీచ్ బ్యూరో(ఆర్వోబీ) ఉపాధి కల్పన నిమిత్తం రాష్ట్రంలోని సాంస్కృతిక బృందాలు, కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. నాటిక, నృత్య నాటిక, వీధి నాటకాలు, ఫ్లాస్మాబ్, జానపద, సాంప్రదాయ, పౌరాణిక కళలు, మ్యాజిక్, తోలుబొమ్మల ఆటలు, ఒగ్గుకథ, యక్షగానం తదితర కళారూపాలు ప్రదర్శించగల కళాకారులు, గాయకులు, సంగీత కళాకారులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నది.
ఆసక్తి ఉన్న వారు తమ దరఖాస్తులను జూన్ 14, 2022లోపు హైదరాబాద్లోని రీజినల్ ఔట్రీచ్ బ్యూరో కార్యాలయానికి పంపాలని సూచించింది. దీనికి సంబంధించిన పూర్తి సమచారం www.davp.nic.in, తాజా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అందుబాటులో ఉందని పేర్కొంది.
దేశవ్యాప్తంగా రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో విభాగాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆరోగ్యం, సంక్షేమంపై కళాకారులతో ప్రదర్శనల ద్వారా వచ్చిన ప్రజలకు అవగాహన కల్పిస్తాయి. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆమోదించిన నియమ, నిబంధనలకు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన కళాకారులు రఖాస్తు చేసుకోవచ్చని హైదరాబాద్ ఆర్వోబీ సంచాలకులు శృతిపాటిల్ తెలిపారు.