హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): అనేక రంగాల్లో పెట్టుబడులకు తెలంగా ణ స్వాగతం పలుకుతున్నదని పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రైవేట్ రంగంలోని సంపద సృష్టికర్తలు, ఎంటర్ప్రెన్యూర్స్, ఉద్యోగాలు సృష్టించేవారికి తగిన గౌరవం లభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లను పెట్టుబడిదారులుగా మాత్రమే చూడకుండా భాగస్వామ్యులుగా పరిగణిస్తున్నామని తెలిపారు. శుక్రవారం పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) ఆధ్వర్యంలో వర్చువల్గా జరిగిన 8వ జాతీయ ఫోరం సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, పాలసీలను సదస్సులోని ప్రతినిధులకు వివరించారు. రాష్ర్టానికి గడిచిన ఏడేండ్లల్లో 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, వాటిలో 24శాతం ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినవారి నుంచే వచ్చాయని పేర్కొన్నారు. కొత్త పెట్టుబడిదారుల వేటలో రాష్ర్టాలు పెట్టుబడి పెట్టిన వారిని మర్చిపోతుంటాయని, ఈ విషయంలో పెట్టుబడిదారులకు తెలంగాణ భరోసా కల్పిస్తున్నదని అన్నారు. పాత పెట్టుబడిదారులే అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లని అభిప్రాయపడ్డారు.
టీఎస్ఐఐసీ వద్ద 2 లక్షల ఎకరాలు
అతిపెద్ద భూ నిధి (ల్యాండ్బ్యాంక్) తెలంగాణ సొంతమని, 2 లక్షల ఎకరాల పారిశ్రామిక స్థలాలు టీఎస్ఐఐసీ వద్ద అందుబాటులో ఉన్నాయని కేటీఆర్ వివరించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సెస్, డిఫెన్స్, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఆటోమోటివ్, ఈవీ, ప్లాస్టిక్, కెమికల్స్, జెమ్స్ అండ్ జ్యువెల్లరీ, రిటైల్ లాజిస్టిక్ తదితర రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. టీఎస్ఐపాస్లో సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా 15 రోజుల గడువులోనే పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులిస్తున్నామని, ఒకవేళ గడువులోగా క్లియరెన్స్ రాకపోతే 16వ రోజే సదరు దరఖాస్తులకు ఆమోదం లభించినట్టేనని వివరించారు. మానవ వనరుల అభివృద్ధికి సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా ప్రభుత్వమే నిధులు ఖర్చుపెట్టి యువకుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించిన సంస్థలకు సర్కారు ద్వారా రాయితీలు కల్పిస్తున్నట్టు గుర్తుచేశారు. 24 గంటలపాటు అంతరాయంలేని విద్యుత్తు సరఫరా చేస్తున్నామని, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో ఉన్నదని వివరించారు. సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఎఫ్ఐసీసీ సెక్రటరీ జనరల్ దిలీప్ చెనాయ్ పాల్గొన్నారు.