Telangana Minister Raja Narsimha | కామారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఈ విచారణ నివేదిక వచ్చిన తర్వాత తగు చర్యలు చేపడతామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల బలోపేతానికి కృషి చేస్తున్నాం అని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ, వారి ఆరోగ్య పరిరక్షణ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని తన కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. జేఏసీ ప్రతినిధులు విజ్ఞప్తి చేసిన పలు అంశాలపై సానుకూలంగా స్పందించారు
ఇటీవల కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో జరిగిన ఘటనపై మంత్రి రాజనర్సింహ చర్చించారు. ఈ ఘటన లో వైద్యుల సస్పెన్షన్ పై జేఏసీ ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందన్నారు. రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయి విచారణ నివేదిక తెప్పించుకుని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతున్నదన్నారు.
డాక్టర్లు, వైద్య సిబ్బంది సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి రాజనర్సింహా అన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ దవాఖానల్లో పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి రాజనర్సింహకు వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని, ఆరోగ్య పరిరక్షణ, వైద్య భద్రత ను కల్పించేలా డాక్టర్లు, వైద్య సిబ్బంది కృషి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వినయ్ కుమార్, తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బొంగు రమేష్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ అధ్యక్షులు డాక్టర్ ఎం. శ్రీనివాస్, జేఏసీ నాయకులు డాక్టర్ రంగా, డాక్టర్ రహుఫ్, డాక్టర్ వినోద్, డాక్టర్ అబ్బయ్య , డాక్టర్ వసంత్ లు పాల్గొన్నారు.