హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): దిశ కేసులో జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తన పరిధిని అతిక్రమించిందని, ఆ కమిషన్ నివేదికను విచారణకు ప్రాతిపదికగా తీసుకోరాదని తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం హైకోర్టును కోరింది. ‘దిశ’ నిందితు ల ఎన్కౌంటర్పై ఆ కమిషన్ నివేదికను సవా లు చేస్తూ పోలీస్ అధికారుల సంఘం దాఖ లు చేసిన పిటిషన్తోపాటు ఇతర పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ విచారణకు నాటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్, ప్రస్తుత టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వ్యక్తిగతంగా హాజరయ్యారు.
పోలీస్ అధికారుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్రెడ్డి వాదిస్తూ.. వాస్తవాలను గుర్తించేందుకు మాత్రమే సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటైందన్నారు. కమిషన్ నివేదిక పోలీసుల వృత్తిని తప్పుపట్టేలా ఉన్నదన్నారు. పోలీసులకు వ్యతిరేకంగా కేసు పెట్టాలని ఇతర పిటిషనర్లకు కమిషన్ సూచించిందని, వారి వాదన వినేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపారు. సజ్జనార్తోపాటు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, షాద్నగర్ పోలీసులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. విచారణను 21కి వాయిదా వేసింది.