Minister KTR | హైదరాబాద్, మే 10(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం బ్రిటన్కు బయలుదేరి సాయంత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా లండన్ ఎయిర్పోర్టులో ప్రవాస భారతీయులు కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. ఈనెల 13వ తేదీ వరకు మంత్రి బ్రిటన్ పర్యటన కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేసిన పలు బ్రిటన్ కంపెనీలు మంత్రితో పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించే అవకాశమున్నది.
యూకేలోని పారిశ్రామిక దిగ్గజ సంస్థలతోపాటు వ్యాపార, వాణిజ్యసంఘాలతో కేటీఆర్ సమావేశమవుతారు. రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, ఇప్పటికే ఇక్కడ కొలువుదీరిన పరిశ్రమల పురోగతిని బ్రిటన్ పారిశ్రామివేత్తలకు వివరించనున్నారు. నిరుడు బ్రిటన్ పర్యటన సందర్భంగా కూడా మంత్రి కేటీఆర్ పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను, ఆయా రంగాల్లోని ఎకోసిస్టంను వివరించగా, పలు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన విషయం విదితమే. రాష్ట్రంలో ఇప్పటికే యూకేతోపాటు అమెరికా, ఫ్రాన్స్, జపాన్, తైవాన్, జర్మనీ తదితర దేశాలకు చెందిన సంస్థలు పరిశ్రమలు నెలకొల్పాయి. వాటి కోసం ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను రాష్ట్రప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. ఈ నేపథ్యంలో తాజాగా, మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. 13న బ్రిటన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ రానున్న కేటీఆర్, 15న కొంగరకలాన్లో నిర్వహించే ఫాక్స్కాన్ పరిశ్రమ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అమెరికా పర్యటనకు వెళ్తారని అధికారులు చెప్పారు.