హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇంటర్వ్యూలు అవసరం లేదనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఇవాళ ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు సైతం ప్రభుత్వం తీపికబురు అందించింది. పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి మరో మూడేళ్లు పెంచుతున్నట్లుగా ప్రకటించింది.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో గ్రూప్-1 ప్రకటన జారీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తులు చేస్తున్నది. గ్రూప్-1లో 503 పోస్టుల భర్తీకి 12 శాఖల నుంచి 19 రకాల పోస్టులకు ప్రతిపాదనలు అందింది. ఇందులో నాలుగైదు రకాల పోస్టులకు ఆయా విభాగాల నుంచి సవరణ ప్రతిపాదనలు అందాల్సి ఉన్నది. ప్రతిపాదనలు అందిన వెంటనే ఆయా పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది.