హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ఎకోజోన్ పేరుతో అటవీశాఖ అధికారులు సృష్టిస్తున్న అడ్డంకులతో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ) ఆదాయానికి గండి పడుతున్నది. ములుగు జిల్లాలోని 29 రీచ్లలో సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల సన్న ఇసుక నుంచి టీఎస్ఎండీసీకి రావాల్సిన రూ.130 కోట్ల ఆదాయం అధికారుల తీరుతో ఆగిపోయింది. ఇసుక తవ్వకంపై ఆధారపడిన గిరిజన సొసైటీలు ఆదాయం లేక, గిరిజనులు రోజువారి కూలీ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లాలో మొత్తం 59 రీచ్ల నుంచి ఇసుక తవ్వుకొనేందుకు గతేడాది జిల్లా స్థాయి కమిటీ (డీఎల్సీ) క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో కాంట్రాక్టర్లు, గిరిజన సొసైటీలు ఇసుక తవ్వకానికి ఏర్పాట్లు చేసుకున్నాయి. కానీ, ఈ ఏడాది ప్రారంభంలో అటవీశాఖ అధికారులు ఏటూరునాగారం మండలంలో 15, కన్నాయిగూడెం మండలంలో 14 రీచ్లు ఎకోజోన్లో ఉన్నాయంటూ ఇసుక తవ్వకాన్ని అడ్డుకొన్నారు. టీఎస్ఎండీసీ ఉన్నతాధికారులు వెళ్లి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. అవి ఎకోజోన్లో లేవని గతంలో కలెక్టర్ కూడా ధ్రువీకరించారు. అయి నా, ఇసుక తవ్వకానికి అటవీశాఖ అడ్డుచెప్తున్నది. ఈ విషయంపై ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్కు టీఎస్ఎండీసీ చైర్మన్ క్రిశాంక్ సమగ్ర రిపోర్ట్ సమర్పించారు. కాగా, టీఎస్ఎండీసీ ఇచ్చిన రిపోర్ట్పై వారం రోజుల్లో ఆ సైట్లు ఎకోజోన్లో ఉన్నాయో, లేవో నోటిఫై చేస్తామన్న జిల్లా అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. గడిచిన రెండు వారాల్లో టీఎస్ఎండీసీకి రావాల్సిన మరో రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల ఆదాయం ఆగిపోయింది. మరో ఆరు నెలల్లో నదీ ప్రవాహం పెరిగితే ఈ రీచ్లలో ఇసుక తవ్వడం సాధ్యం కాదు. అయినా ఇప్పటి వరకు జిల్లా అధికారుల నుంచి స్పందన లేదని టీఎస్ఎండీసీ అధికారులు తెలిపారు. పర్యావరణపరంగా చూసినా ఈ 29 రీచ్లకు అనుమతులు ఇవ్వాలని టీఎస్ఎండీసీ చైర్మన్ క్రిశాంక్ కోరారు. నదిలో నీటిని నిల్వ ఉంచడానికి, వరద ముప్పులను తట్టుకోవడానికి ఇసుక తవ్వకాలు చేయాలని ములుగు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు.