కృష్ణకాలనీ, మార్చి 14: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హర్ మండలంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు బుధవారం సాయంత్రం మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే సమయంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించినట్టు భూపాలపల్లి విద్యుత్తు శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ మల్సూర్ నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 13న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘మంత్రి శ్రీధర్ బాబుకు కరెంట్ కష్టాలు’ కథనానికి ఎస్ఈ స్పందించారు. మంత్రి కార్యక్రమాలు దాదాపు మూడున్నర గంటలు కొనసాగినట్టు పేర్కొన్నారు. 3 కేవీ లైన్లో ఎర్త్ సమస్య తలెత్తడంతో 4 నిమిషాల్లో కరెంట్ సరఫరాను పునరుద్ధరించినట్టు తెలిపారు. విద్యుత్తు శాఖ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తూ నాణ్యమైన విద్యుత్తును సరఫరాను అందజేస్తున్నట్టు వివరించారు.