ఖిలావరంగల్: చారిత్రక వారసత్వాన్ని ఆరోగ్య సాధనకు ముడిపెట్టిన యోగ అత్యంత స్ఫూర్తిదాయకమైనది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో (Khila Warangal) యోగ పరిమళం గుబాలించింది. యోగాసనాలతో కీర్తి తోరణాల ప్రాంగణంలో ప్రాణామ్యాయం ప్రతిధ్వనించింది. ప్రకృతి మాధుర్యానికి జతకట్టిన యోగాసనాల ప్రదర్శనను స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అంతర్జాతీయ యోగా వేడుకల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు, జిల్లా అధికార యంత్రాంగం, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో యోగా గురువు అమృతవల్లి ఆసనాలు వేయించారు.
యోగాసనాలు ఒకవైపు.. మరోవైపు కాకతీయుల కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన తోరణాలు, శిల్పాలపై పడిన భానుడి లేలేత కిరణాలు ప్రత్యేక ప్రత్యేక ఆహ్లాదాన్ని కలిగించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చారిత్రక ప్రదేశాల్లో యోగా చేయడం మన సంస్కృతి గొప్పతనాన్ని గుర్తు చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవనశైలిలో అంగీకరించాలన్నారు. యోగ కేవలం వ్యాయామమే కాకుండా మన ప్రాచీన ధ్యాన సాంప్రదాయానికి నిదర్శనమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత సోమ్ లాల్, 37, 38 డివిజన్ల కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ, కేంద్ర పురావస్తు శాఖ ఏఈ కిషోర్ రెడ్డి, జిల్లా అధికారి నవీన్, అదానపు కలెక్టర్ సంధ్యారాణి, డిఎంహెచ్వో డాక్టర్ సాంబశివరావు, జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డిఆర్డిఓ పిడి కౌసల్యాదేవి, డిపిఆర్ఓ అయూబ్ అలీ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పుష్పలత, డీఏఓ ఫణికుమార్, ఖిలా వరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.