హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలపై చర్చకు అంతర్జాతీయస్థాయి సమావేశం వేదిక అయ్యింది. మన పథకాల గురించి తెలుసుకొనేందుకు వివిధ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆసక్తి చూపించారు. గురువారం ఇటలీ దేశంలోని వెరోనాలో అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ (ఇస్టా) వార్షిక సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా ప్రపంచ ఆహార సంస్థ (ఎఫ్ఏవో) డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూతోపాటు 48 దేశాలకు చెందిన 200 మంది విత్తన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఇస్టా అధ్యక్షుడు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ కే కేశవులు రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలను వివరించారు. 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్టు, పంటల కొనుగోలు విధానాన్ని కళ్లకుగట్టారు. పలువురు శాస్త్రవేత్తలు పథకాల అమలు తీరును అడిగి తెలుసుకొన్నారు.
రైతుకు వెన్నుదన్నుగా సర్కారు: కేశవులు
దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి, రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నదని కే కేశవులు వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం 8 ఏండ్లలోనే 160% వృద్ధిని నమోదు చేసినట్టు చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో రికార్డులు సృష్టించి దేశానికి అన్నపూర్ణగా ఎదిగిందని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తన సరఫరాకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ఇస్టా నాణ్యమైన విత్తన సరఫరాకు కృషి చేస్తామని చెప్పారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆహార భద్రతలో స్వయం సమృద్ధిని సాధించేందుకు కొత్త వంగడాల అభివృద్ధి, మొక్కల్లో జన్యు వనరుల సంరక్షణ, విత్తన ఆరోగ్యం, విత్తన నిల్వ వంటి అంశాలపై మరింత దృష్టి కేంద్రీకరించనున్నట్టు తెలిపారు. 2050 నాటికి ప్రపంచ జనాభా 9.5 బిలియన్లకు చేరుకొంటుందని, ఇందుకు తగ్గట్టుగా ఆహార భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఎఫ్ఏవో డీజీ క్యూ డోంగ్యూ సమావేశాన్ని ఉద్దేశించి ఆన్లైన్లో మాట్లాడుతూ, విత్తన రంగంలో మరింత అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ఎఫ్ఏవో, ఇస్టా కలిసి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.