హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివిధాలా అండగా ఉంటున్నారని సాంఘిక సంక్షేమ, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. సీఎం కేసీఆర్ దివ్యాంగుల బడ్జెట్ను రూ.56 కోట్లకు పెంచారని, అందులో రూ.20 కోట్లను ఉపకరణాలకే కేటాయించారని తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్.. దివ్యాంగులకు సత్వర సేవలను అందించేందుకు ఏర్పాటుచేసిన నూతన హెల్ప్లైన్ టోల్ఫ్రీ నంబర్ 155326తో పాటు, ఉపాధి అవకాశాల సమాచారం, పేర్ల నమోదు కోసం రూపొందించిన దివ్యాంగ ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజీ వెబ్పోర్టల్ను ఆవిష్కరించారు. క్వాల్కమ్ కంపెనీ సీఎస్సార్ నిధుల ద్వారా సమకూర్చిన ఎనిమిది చేయూ త వాహనాలను హెల్ప్లైన్ విభాగానికి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. ఇకనుంచి దివ్యాంగుల సంక్షేమశాఖ దివ్యాంగుల సాధికారత సంస్థ పేరిట స్వతంత్రశాఖగా కొనసాగనున్నదని, ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. సంక్షేమంలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఖ్యాతి సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. రాష్ట్రంలో దివ్యాంగులకు అమలు చేస్తున్నన్ని పథకాలు దేశంలో ఎక్కడా లేవని వివరించారు. కల్యాణలక్ష్మి, దళితబంధు, డబుల్బెడ్రూం ఇండ్లు తదితర అన్ని ప్రభుత్వ పథకాల్లో దివ్యాంగులకు ప్రత్యే క ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని వివరించారు.
భవిష్యత్తులో మరిన్ని ప్రణాళికలతో దివ్యాంగుల సంక్షేమశాఖను ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఈ ఏడాది కనీవిని ఎరుగని రీతిలో దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించామని, 33 జిల్లాల్లో జిల్లా స్థాయి క్రీడాపోటీలు, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించామని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గుర్తుచేశారు. ప్రభుత్వం 5.58 లక్షల మంది దివ్యాంగులకు ఏటా రూ.2 వేల కోట్ల నిధులు పెన్షన్ కోసం ఖర్చు చేస్తున్నదని వివరించారు.
అనంతరం వివిధ రంగాల్లో రాణిస్తున్న 25 మంది దివ్యాంగులను మంత్రి కొప్పుల శాలువాలతో సత్కరించి నగదు పురస్కారాలను అందజేశారు. వేడుకల్లో భాగంగా తొలుత దివ్యాంగులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అబ్బురపరిచాయి. దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ అధ్యక్షతన కొనసాగిన వేడుకల్లో మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యరాజన్, జీఎం ప్రభంజన్రావు, దివ్యాంగుల సంఘాల నాయకులు నల్లగొండ శ్రీను, నారా నాగేశ్వరరావు, గంగారాం, సుమన్, రాజేందర్, మున్నా, మల్లికార్జున్, సుధాకర్వర్మ, రాజ్యలక్ష్మి, ఏడీలు రాజేందర్, మోతి, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
త్రిచక్ర వాహనం అందజేసిన నిరంజన్రెడ్డి
దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో అడుగులు వేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో నాగర్కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల దివ్యాంగ విద్యార్థి పవన్కుమార్కు సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా త్రిచక్ర వాహనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు.
దివ్యాంగుల కోటా అమలు: మంత్రి శ్రీనివాస్గౌడ్
విద్య, ఉద్యోగాల్లో దివ్యాంగుల రిజర్వేషన్లు పక్కాగా అమలుచేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్లోని అంబేద్కర్ కళాభవన్లో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు నెలకు రూ.3,016 పింఛను అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. అనంతరం ప్రభుత్వం ప్రత్యేకంగా దివ్యాంగుల శాఖను ఏర్పాటు చేయడంపై మంత్రి సమక్షంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి దివ్యాంగులు క్షీరాభిషేకం చేశారు.
గుజరాత్లో పింఛన్ రూ.750: జగదీశ్రెడ్డి
దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ.3,016 పింఛన్ అందజేస్తుంటే.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కేవలం రూ.750 ఇస్తున్నారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి వివరించారు. గుజరాత్లో కేవలం 40 వేల మందికే ఈ పింఛన్ అందుతున్నదని చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి ఆయన దివ్యాంగులకు చెక్కులు, ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దివ్యాంగులకు కొండంత అండగా నిలిచి వారి ఆత్మగౌరవాన్ని పెంచారని తెలిపారు.
టాస్క్ ద్వారా ఉచిత శిక్షణ: జయేశ్రంజన్
రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఐటీ, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ తెలిపారు. శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మాదాపూర్లోని టీహబ్-2.0లో ఏర్పాటుచేసిన తెలంగాణ అసిస్టివ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులకు అర్హతలతో నిమిత్తం లేకుండా తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ద్వారా ఆరు వారాల నుంచి మూడు నెలలపాటు శిక్షణ ఇచ్చి.. ప్లేస్మెంట్స్ కల్పిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంత తౌటం, పల్లె సృజన వ్యవస్థాపకుడు బ్రిగేడియర్ గణేశన్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులు సులభంగా వస్ర్తాలు నేసేందుకు వీలుగా మోద శివ అనే ఔత్సాహికుడు రూపొందించిన యంత్రం బెస్ట్ గ్రాస్రూట్ ఇన్నోవేషన్ అవార్డుకు ఎంపికైంది. బెస్ట్ స్టార్టప్ ఇన్నోవేషన్గా స్టార్టాన్ ల్యాబ్స్ రూపొందించిన అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రాక్టీస్ ఎంపిక కాగా బెస్ట్ స్టూడెంట్ ఇన్నోవేషన్గా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బాల ఏసు పాఠశాల రూపొందించిన స్టార్ట్ బ్యాండేజ్ ఎంపికైంది.
దివ్యాంగుల సంబురాలు
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేకశాఖను ఏర్పాటుచేయడాన్ని హర్షిస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దివ్యాంగులు సంబురాలు చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జిల్లా దివ్యాంగుల సంక్షేమ సమితి నాయకుడు దొంతినేని చందర్రావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వీ ట్లు పంచిపెట్టారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం, దివ్యాంగుల మండల అధ్యక్షుడు జాల మోహన్రావు ఆధ్వర్యం లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం పలువురు దివ్యాంగులు కేక్ కట్ చేశారు.