Dharmapuri Srinivas | హైదరాబాద్/నిజామాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మాజీ మంత్రి డీ శ్రీనివాస్ కుటుంబ కలహాలు రచ్చకెక్కాయి. మొన్నటివరకు డీఎస్, ఆయన ఇద్దరు కొడుకులు చెరో పార్టీలో కొనసాగారు. ఉన్నట్టుండి ఆదివారం సాయంత్రం డీ శ్రీనివాస్, ఆయన పెద్ద కొడుకు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అగ్ర నాయకుల సమక్షంలో కాంగ్రెస్లో తిరిగి చేరారు. పార్టీ కండువా ధరించారు. 24 గంటలు గడవకముందే కథ అడ్డం తిరిగింది. సీన్లోకి డీఎస్ సతీమణి ధర్మపురి విజయలక్ష్మి ప్రవేశించారు. ఆమె పేరిట ఒక లేఖ, ఆమె సాక్షిగా ఉన్నట్టుగా పేర్కొన్న మరో లేఖ విడుదలయ్యాయి. డీఎస్ కాంగ్రెస్లో చేరలేదని, ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఈ సమయంలో రాజకీయాలు చేయడం తగదంటూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ఇటువైపు ఇంకోసారి రాకండంటూ చేతులు జోడించి వీడియోను సైతం రిలీజ్ చేశారు. ఈ పరిణామాల వెనుక తన తమ్ముడు, బీజేపీ ఎంపీ అర్వింద్ ఉన్నారని ధర్మపురి సంజయ్ మండిపడ్డారు.
‘ఈ నెల 26న నా కుమారుడు డీ సంజయ్ కాంగ్రెస్లో తిరిగి చేరిన సందర్భంగా, ఆశీస్సులు అందజేయడానికి గాంధీభవన్కు వెళ్లిన నాకు కండువా కప్పి, నేను కూడా మళ్లీ పార్టీలో చేరినట్టుగా మీడియాలో ప్రచారం చేశారు. నేను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే. కానీ, ప్రస్తుతం నా వయస్సు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండదల్చుకున్నాను. పార్టీలో నా చేరికకూ, నా కుమారుడు సంజయ్ టికెట్కు ముడిపెట్టడం భావ్యం కాదు. రాజకీయాలకు దూరంగా ఉన్న నన్ను వివాదాల్లోకి లాగవద్దు. కాంగ్రెస్లో నేను మళ్లీ చేరానని మీరు భావిస్తే ఈ లేఖను నా రాజీనామాగా భావించి ఆమోదించాల్సిందిగా కోరుకుంటున్నాను’ అంటూ డీఎస్ రాసిన లేఖలో పేర్కొన్నారు. లేఖ చివరలో ఎడమ చేతి వైపు విజయలక్ష్మి సాక్షి సంతకం చేయడం విశేషం.
ఆ వెంటనే విజయలక్ష్మి పేరిట మరో లేఖ, వీడియో సందేశం విడుదలయ్యాయి. ‘ఇగో డీఎస్ గారి రాజీనామా. ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. ఆయనను మీరు పార్టీలో చేర్చుకునే పద్ధతి ఇది కాదు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, పక్షవాతం కూడా వచ్చింది. మీ రాజకీయాలకు ఆయనను వాడుకోవద్దు. మీరు నిన్న పెట్టిన ఒత్తిడికి ఆయనకు రాత్రి ఫిట్స్ వచ్చాయి. కాంగ్రెస్ వాళ్లకి చేతులు జోడించి దండం పెడుతున్న ఇటువైపు రాకండి’ అని పేర్కొన్నారు.
హైదరాబాద్లో డీఎస్కు చికిత్స చేస్తున్న ఓ దవాఖాన అకస్మాత్తుగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయన మెదడు సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని, రాజకీయాలకు, ఒత్తిడికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఢిల్లీలో ఉన్న ధర్మపురి అర్వింద్ ఓ వీడియోను విడుదల చేశారు. తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని, ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. బులిటెన్లో పేర్కొన్న విషయాలనే అర్వింద్ చెప్పడంతో అనుమానాలకు తావిచ్చింది.
తన తండ్రి డీఎస్కు ప్రాణహాని ఉన్నదని ధర్మపురి సంజయ్ ఆరోపించారు. నిజామాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన తల్లి అర్వింద్ చెప్పినట్టే వింటుందని, ఆమెకు రాజకీయాలు తెలియవని పేర్కొన్నారు. అర్వింద్ తమ తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేస్తూ, రాజకీయాలకు నిర్దాక్షణ్యంగా వాడుకుంటున్నాడని మండిపడ్డారు. అర్వింద్ రాజకీయ పతనం మొదలైందని, ప్రజలు తిరగబడ్డనాడు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. తాను, డీఎస్ కలిసి కాంగ్రెస్లో చేరినట్టు స్పష్టంచేశారు. ఏడాది క్రితమే తాము కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందని చెప్పారు. సోమవారం తన తండ్రి పేరుతో వచ్చిన లేఖలు కల్పితాలని, ఇవన్నీ తమ ఇంట్లో ఉన్న ఓ బీజేపీ నాయకుడు చేస్తున్న డ్రామాలని పేర్కొన్నారు. కల్పిత లేఖలను నమ్మొద్దని కోరారు.