హైదరాబాద్, ఫిబ్రవరి 28 : ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐసర్)లో ప్రవేశాలు పొందవచ్చని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను ఆ దిశగా సమాయత్తం చేయాలని సూచించారు. జాతీయ సైన్స్డే సందర్భంగా సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్తో వినోద్కుమార్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న అటానమస్ విద్యాసంస్థ అయిన ఐసర్లో బ్యాచ్లర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్) కోర్సుల్లో అడ్మిషన్లకు అవకాశం ఉన్నదని తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) స్థాయిలో ఐసర్ విద్యా సంస్థలను కేంద్ర ప్రభుత్వం స్థాపించిందని పేర్కొన్నారు. ఇవి బెర్హంపూర్, భోపాల్, కోల్కతా, మొహాలీ, పుణే, తిరువనంతపురం, తిరుపతిలో ఉన్నాయని తెలిపారు. విదేశీ యూనివర్సిటీల్లోని కోర్సుల తరహాలో బీఎస్, ఎంఎస్లకు ప్రాధాన్యత ఉన్నదని వెల్లడించారు. ఇంటర్ ఎంపీసీ, బీపీసీ తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్ చదువులు మాత్రమే అని విద్యార్థులు సహా వారి తల్లిదండ్రులు భావిస్తున్నారని, ఈ దృక్పథం మారాలని అభిప్రాయపడ్డారు. ఈ రెండు కోర్సులను పూర్తిచేసిన వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు ఉంటాయని వివరించారు. సైన్స్ కోర్సులు ఎవర్గ్రీన్ కోర్సులని, వీటికి ఎప్పటికీ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయోటెక్నాలజీ కోర్సుల్లో విద్యార్థులు ప్రావీణ్యతను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.