Suicide: సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న వైష్ణవి అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు సూర్యాపేటలోని 9వ వార్డులోగల ఎన్టీఆర్ కాలనీ వాసిగా తోటి విద్యార్థినిలు తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, వైష్ణవి మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, నిజనిర్ధారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆమె కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. ఆ మేరకు గురుకుల పాఠశాల ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. అదేవిధంగా సూర్యాపేట పెన్ పహాడ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.