హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో 18ని జారీ చేశారు. దీంతో ఇక నుంచి ఎంసెట్ మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయిస్తారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, మెడికల్, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీని అమలు చేస్తూ 2011లో అప్పటి ప్రభుత్వం జీవో 73 జారీ చేసింది.
ఎంసెట్ మార్కులను 75 శాతం, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని అమలు చేస్తున్నారు. అయితే, ఈ విధానంతో విద్యార్థులకు నష్టం కలుగుతున్నదన్న వాదనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ వెయిటేజీ రద్దుపై ప్రభుత్వం ఒక కమిటీని వేసి అధ్యయనం చేయించింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ, ఇంటర్ బోర్డుల నుంచి అభిప్రాయాలు తీసుకొన్నది. అంతా వెయిటేజీ రద్దుకే మొగ్గుచూపారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా వెయిటేజీ నుంచి మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు శాశ్వతంగా ఎత్తివేసింది.