హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఒక పేపర్కు బదులు మరో పేపర్ ఇచ్చిన ఘటనలు వెలుగుచూశాయి. తొలిరోజు సంస్కృతం పేపర్కు బదులు హిందీ ప్రశ్నపత్రాలు ఇచ్చారు. హనుమకొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో ఓ ఇద్దరు విద్యార్థులకు సంస్కృతానికి బదులు హిందీ ప్రశ్నపత్రాలు ఇచ్చారు. పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులు టెన్షన్పడ్డారు.
ఇదే విషయంపై తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన వారికి మెమో ఇవ్వాలని డిమాండ్చేశారు. కాగా, పలు చోట్ల నాలుగైదు నిమిషాలు ప్రశ్నపత్రాలు ఆలస్యంగా అందాయి. చాలా జిల్లాల్లో ఆయా సెంటర్లల్లో నిర్దేశిత సమయం కన్నా ఆలస్యంగా ప్రశ్నపత్రాలు చేరాయి. ఖమ్మం జిల్లాల్లోని కొన్ని సెంటర్లలో 10 నిమిషాలు ఆలస్యమైనట్టు తెలిసింది. దీంతో ఇంటర్బోర్డు అప్రమత్తమైంది.
నిర్దేశిత సమయం కన్నా.. ఐదు నిమిషాల ముందే పోలీస్స్టేషన్ల నుంచి ప్రశ్నపత్రాలను స్వాధీనం చేసుకోవాలని ఇంటర్బోర్డు ఆదేశించింది. సహజంగా ప్రశ్నపత్రాలను ఉదయం 8:30 గంటలకు అధికారులు పోలీస్స్టేషన్ల నుంచి తీసుకుంటారు. అయితే గ్రేటర్ సహా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పోలీస్స్టేషన్ల నుంచి సెంటర్లు దూరంగా ఉండటం కూడా సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఉదయం 8:25గంటలకే పేపర్లను స్వాధీనం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే 15,903 మంది గైర్హాజరయ్యారు. మొత్తం విద్యార్థుల్లో 4% విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదు. తొలిరోజు రెండో భాష పేపర్-1కు పరీక్షలు నిర్వహించారు. తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, అరబిక్ పేపర్లకు పరీక్షలు జరిగాయి. పరీక్షల సందర్భంగా ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించారు. అయినా కొందరు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ సెంటర్లో ఓ విద్యార్థి పరీక్షకు ఆలస్యంగా రాగా అప్పటికే గేట్ మూసివేశారు. ఆ విద్యార్థిని పరీక్షకు అనుమతించలేదు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనూ ఓ విద్యార్థి ఆలస్యంగా రాగా పోలీసులు అనుమతించలేదు. గురువారం నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పరీక్షల సందర్భంగా తొలిరోజే ఇంటర్బోర్డు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించింది. ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య హైదరాబాద్లోని పలు కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంటర్బోర్డు పరిశీలకులు పలు జిల్లాల్లో తనిఖీలు నిర్వహించారు.
మొత్తం విద్యార్థులు 5,14,598
పరీక్షకు హాజరైనవారు 4,98,695
గైర్హాజరైనవారు 15,903