మహబూబాబాద్ : విద్యార్థి దశ నుంచే పరిశోధనలపై విద్యార్థులు ఆసక్తిని పెంచుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (బాలికల) స్కూల్, జూనియర్ కాలేజీలో నిర్వహించిన జిల్లా వైజ్ఞాన ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలతో విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీయవచ్చని వెల్లడించారు. పరిశోధనల పట్ల ఆసక్తి పెంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలుంటాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్దుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని అన్నారు.సర్కార్ బడులల్లో అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రవేశపెట్టిన మనఊరు-మనబడితో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయిని స్పష్టం చేశారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందన్నారు.
పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ ఉపకరణాలు, ఆదర్శ గ్రామాలు, స్వచ్ఛభారత్, నూతన సాగు పద్ధతులు, రీసైక్లింగ్ ప్రాసెస్, వినూత్న వైజ్ఞానిక ఆవిష్కరణలను మంత్రి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోత్ బిందు, శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, డీఈవో, ప్రిన్సిపాల్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.