Telangana | భద్రాచలం : రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేండ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలక మండలి సమావేశంలో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత నాలుగేండ్లుగా ఐటీడీఏలో పాలకమండలి సమావేశం జరగలేదని, ఇప్పట్నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం సాక్షిగా డ్వాక్రా మహిళలకు తీపి కబురు చెబుతున్నాం. ఇప్పటికే మహిళలకు పెద్దపీట వేసి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. త్వరలో డ్వాక్రా మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. ఆశా వర్కర్లకు జీతాలు అందే విధంగా కృషి చేస్తానని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.