హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): పరీక్షల సంస్కరణల్లో భాగంగా ఇంటర్బోర్డు కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఒక ఇంటర్నల్ పరీక్షను రద్దు చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను తొలగిస్తున్నట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పాఠ్యాంశాలను లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో విలీనం చేయడం వల్ల ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు తెలిపారు.
మరో ఇంటర్నల్ అయిన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను యథాతథంగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. వంద మార్కుల ఈ ఇంటర్నల్ పరీక్షను కాలేజీలోనే నిర్వహించి, అదే కాలేజీ లెక్చరర్లు మూల్యాంకనం చేసి, మార్కులేస్తారు. ఇది క్వాలిఫైయింగ్ పేపర్ కాగా, ఈ మార్కులను రెగ్యులర్ మార్కుల్లో కలపరు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఫస్టియర్లో ప్రాక్టికల్స్ అమలుచేయనుండటంతో థియరీకి, ప్రాక్టికల్స్కు వేర్వేరు పాఠ్యపుస్తకాలను బోర్డు సిద్ధం చేసింది. ఇంగ్లిష్ సబ్జెక్టు పుస్తకాల్లో ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ పాఠ్యాంశాలు అంతర్భాగంగా ఉండటంతో ప్రత్యేకంగా పరీక్ష అవసరం లేదని అధికారులు భావించి, ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.