Warangal | వరంగల్ : వరంగల్ జిల్లాలో అంతర్ రాష్ట్రం దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల ముఠా నుంచి బంగారు, వజ్రాల ఆభరణాలు, రూ. 5,20,000 విలువైన గంజాయి, ఒక పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లు, కారు, నాలుగు మొబైల్స్, రెండు వాకీటాకీలు, నాలుగు నకిలీ ఆధార్ కార్డులు, రూ. 5 వేల నగదును పోలీసులు సీజ్ చేశారు. అపార్ట్మెంట్లలో తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనాలతో పాటు గంజాయి విక్రయాలకు కూడా పాల్పడుతున్నట్లు తేలింది.
దొంగల ముఠాలోని సభ్యులను అక్బర్ ఖురేషి, కపిల్ జాటోవు, మహమ్మద్ షరీఫ్, ఎండీ జాద్ ఖాన్గా గుర్తించారు. వీరంతా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని తెలిపారు. ఈ నెల ఐదో తేదీన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మట్టేవాడ, హనుమకొండ, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలో అపార్ట్మెంట్లలో తాళం వేసివున్న ఎనిమిది ఇండ్లను లక్ష్యంగా చేసుకొని పెద్ద మొత్తంలో బంగారు, వెండి అభరణాలతో పాటు నగదు చోరీ చేశారు.