హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి సోమవారం గన్ఫౌండ్రీలోని తన కార్యాలయంలో ఫలితాలను వెల్లడించారు. కరోనా నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయగా పరీక్ష ఫీజు చెల్లించిన 4,73,850 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అందులో 1,76,726 మంది ఏ గ్రేడ్ సాధించారు. 1.04 లక్షల మంది బీ గ్రేడ్ సొంతం చేసుకొన్నారు. మొత్తం విద్యార్థుల్లో 2,37,441 మంది బాలికలుండగా, 2,36,409 మంది బాలురు ఉన్నారు. విద్యార్థులు పొందిన మార్కులను వెబ్సైట్లో పొందుపరిచారు. ఫలితాల కోసం విద్యార్థులు ఫస్టియర్ హాల్టికెట్ నంబర్, ప్రైవేట్ విద్యార్థులు తమ పూర్వపు హాల్ టికెట్ నంబర్ల ఆధారంగా tsbie.cgg.gov.in, examresults.ts.nic.in, results.cgg.gov.in వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు. ఆ మార్కులతో సంతృప్తి చెందకపోతే కరోనా పరిస్థితులు సద్దుమణిగాక పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులంతా తమ ఆసక్తికనుగుణంగా కెరీర్ను ఎంపికచేసుకొని, భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా, మార్కుల జాబితాను 10 రోజుల్లో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయాల నుంచి పొందవచ్చని ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు. మెమోల్లో తప్పులు దొర్లితే సవరించేందుకు ఇంటర్బోర్డులో ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. www.bigrs.telangana.gov.in వెబ్సైట్, BIGRS మొబైల్యాప్, 040 -24600110 నంబర్కు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సంప్రదించవచ్చు.
గ్రేడ్ల వారీగా వివరాలు
గ్రేడ్ విద్యార్థులు
ఏ గ్రేడ్ (75% ఆపై మార్కులు పొందినవారు) 1,76,726
బీ గ్రేడ్ (60% – 75% మధ్య) 1,04,896
సీగ్రేడ్ (60%- 50% మధ్య) 61,901
డీ గ్రేడ్ (50% – 35% మధ్య) 1,08 347
కంపార్ట్మెంటల్ పాస్ 21,980