బేగంపేట్, ఏప్రిల్ 16 : బేగంపేట్ డివిజన్లోని ప్రకాశ్నగర్, మయూరిమార్గ్లోని నాలాలను అభివృద్ధి పరిచి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నాలాల అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముంపు సమస్యను పరిష్కరించడమే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లక్ష్యమన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన బేగంపేట్ డివిజన్లో పర్యటించారు. ముందుగా ధనాలగుట్టలో జరుగుతున్న శ్మశాన వాటిక అభివృద్ధి పనులను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అవసరమైతే మరిన్ని నిధులు వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అనంతరం శ్యాంలాల్ బిల్డింగ్లో రూ.11లక్షలతో చేపడుతున్న సీవరేజీ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత బేగంపేట్ ప్రకాశ్నగర్ నాలాను పరిశీలించారు.
అనంతరం మయూరిమార్గ్లో ఎమ్మెల్యే కృష్ణారావు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బేగంపేట పరిసర ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఏవైనా అభ్యంతరాలు వస్తే వారికి టీడీఆర్ ఇచ్చి నాలాలను అభివృద్ధి పర్చాలన్నారు. నాలాల అభివృద్ధిలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించవద్దని ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచించారని గుర్తుచేశారు. సమగ్ర నివేదిక సిద్ధం చేసి వారంలోపు సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు రూపొందించిన ప్రణాళికను సీఎం కేసీఆర్కు సమర్పిస్తామని తెలిపారు. దీనికి అనుగుణంగా నిధులు కేటాయించడం జరుగుతుందని అన్నారు. నాలా అభివృద్ధిలో భాగంగా ఎలాంటి అడ్డంకులు వచ్చినా.. వాటిని అధిగమించి రాబోయే వర్షాకాలం నాటికి పనులు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో బేగంపేట డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, జలమండలి అధికారులతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.