హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు 25 నుంచి ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమవుతాయని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు. గురువారం నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు, నోడల్ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను 1,400 నుంచి 1,768కి పెంచామని తెలిపారు. ప్రతి కేంద్రంలో ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్ వేసుకున్న సిబ్బందితోనే విధులు అప్పగించామని తెలిపారు. మాస్క్లు ధరించిన విద్యార్థులు, సిబ్బందినే అనుమతిస్తామని స్పష్టంచేశారు.