Temperature | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): మారుతున్న పర్యావరణ పరిస్థితులు, గ్రీన్హౌస్ గ్యాసెస్ ప్రభావంతో భూమ్మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనికి తోడు మానవ తప్పిదాలు, అంతరించిపోతున్న వన సంపద కారణంగా ఉష్ణోగ్రతలు మరింత అధికమవుతున్నాయి. వేసవితోపాటు ఇతర సీజన్లలోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏటా వేసవిలో నమోదయ్యే గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 5 శాతం ఎండల తీవ్రత అధికం గా ఉంటుందని లాన్సెట్ అధ్యయనంలో వెల్లడైంది. ఏటా ఎండలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, 2019-20లో దేశంలో ఏకంగా 32 లక్షల మంది జనాలు అనారోగ్యానికి గురైనట్టు తేలింది. దేశంలోని మెట్రో నగరాల్లోనూ ఎండల తీవ్రత రానున్న రో జుల్లో మరింత పెరిగి, నిప్పుల కుంపటిగా మారే ప్రమాదముందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో సగటున 39-40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే, ఇదే తీరుగా ఉష్ణోగ్రతలు పెరిగితే వచ్చే 70 ఏండ్లలోనే తీవ్ర ఉష్ణ మండల ప్రాంతంగా మారే ప్రమాదం ఉన్నదని వాతావరణశాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేసవి సీజన్ ఆరంభంలోనే 40 డిగ్రీలు దాటుతుంటే, నిండు సీజన్లో తీవ్ర రూపం దాల్చుతున్నది. 2011 నుంచి 2021 వరకు నమోదైన ఉష్ణోగ్రతల సగటు కంటే 3 శాతం ఎక్కువగా ఉందని శాస్త్రీయంగా గుర్తించారు. ఢిల్లీ, కోల్కతా వంటి నగరాల్లో 2 శాతం ఉష్ణోగ్రతలు మార్పు చెందడంతో ఏటా 5-8 రోజులపాటు వేసవి ప్రమాద హెచ్చరికలు జారీ చేయాల్సి వస్తోంది. ఈ లెక్కన పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఏడాదిలో ఏకంగా 12-15 రోజుల పాటు తీవ్రమైన వేడితో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొవాల్సి ఉంటుందనే అంచనాలున్నాయి. దేశంలోని ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ఎండల ప్రభావం భయానక పరిస్థితులకు కారణమవుతున్నది. ఆయా నగరాల్లో ఇలాంటి పరిస్థితులు 1990 నుంచి 2019 వరకు నమోదవుతూనే ఉన్నాయి.
దేశంలో 2011-2021 వరకు అన్ని సీజన్లలో నమోదైన ఉష్ణోగ్రతల ఆధారంగా అధ్యయనం చేశా రు. ఇందులో 2019-20 ఏడాదిలో ఏకంగా ఒక్క భారత్లోనే 32 లక్షల మంది వేసవి తాపానికి గురై తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తేలింది. గతంలో ఈ స్థాయిలో ప్రభావం చూపిన దాఖాల్లేవని లాన్సెట్ నివేదిక తెలిపింది. ఇందులో మెజార్టీ జనాలు 50 ఏండ్లు పైబడినవారే కావడం ఆందోళన కలిగిస్తున్న ది. ఆసియాలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు ఈ ఏప్రిల్లో భారత్, చైనాలో నమోదయ్యాయి. ఎం డవేడి వాడగాడ్పులతో బెంబేలెత్తుతున్నారు.
హైదరాబాద్లో ఇప్పటికైతే ఎండల తీవ్రత మిగ తా మెట్రో నగరాల కంటే తక్కువే ఉన్నా మారుతు న్న పర్యావరణ పరిస్థితులు వేసవి ప్రభావం చూపే అవకాశం ఉన్నది. వేసవిలో మాత్రమే కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తుండగా, మిగతా సీజన్లలో ఆహ్లాదకర వాతావరణమే ఉంటున్నది. దీనికి సముద్ర మ ట్టానికి 544 మీటర్ల ఎత్తులో ఉండటం కూడా కారణం. వేసవిలో కురిసే మోస్తరు వర్షాలు నగర వాతావరణాన్ని చల్లబరుస్తున్నాయని తేలింది.
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేడిగాలులు వీస్తున్నాయి. ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా జయశంకర్ జిల్లా మహదేవ్పూర్, జగిత్యాల జిల్లా మల్లాపూర్, నల్లగొండ జిల్లా కట్టంగూర్, నిర్మల్ జిల్లాలో 45 డిగ్రీలు నమోదైనట్టు చెప్పింది. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. గురువారం పలు చోట్ల 40-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. 21వ తేదీ నుంచి 4, 5 రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నది.