బీమారంగ ఉద్యోగుల సంఘం నేతల పిలుపు
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరణకు డిమాండ్
‘అమ్మకానికి ప్రజల నమ్మకం’ బుక్లెట్ ఆవిష్కరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 : కేంద్ర ప్రభుత్వ రంగంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో వాటాల విక్రయానికి నరేంద్రమోదీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించాలని బీమారంగ ఉద్యోగుల సంఘం (ఐసీఈయూ) నేతలు పిలుపునిచ్చారు. ‘అమ్మకానికి ప్రజల నమ్మకం’ పేరుతో ఎంవీఎస్ శర్మ రాసిన బుక్లెట్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం అబిడ్స్లో జరిగింది. ఎల్ఐసీ ఉద్యోగ సంఘం హైదరాబాద్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్, మద్దిలేటి, సిటీ బ్రాంచ్-7 అధ్యక్షుడు మహేశ్, కార్యదర్శి వీ రమేశ్గౌడ్ మాట్లాడుతూ.. ఎల్ఐసీలో ప్రభుత్వ మూలధనం రూ.100 కోట్లేనని, కానీ ఆ సంస్థ ఏటా తన లాభాల్లో 5 శాతాన్ని ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో ఇస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం రూ.28,000 కోట్లు డివిడెండ్ ఇచ్చిందని, అయినా ఇది చాలదన్నట్టు ఎల్ఐసీ నుంచి 5-10 శాతం వాటాను ఉపసంహరించుకొని రూ.లక్ష కోట్లు సమీకరించుకొనేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. దీనివల్ల 40 కోట్ల మంది పాలసీదారుల భవితవ్యం ఆందోళనకరంగా మారిందని పేర్కొన్నారు.
కార్పొరేట్లకు రాయితీలే కొంప ముంచుతున్నాయి..
కార్పొరేట్లకు కేంద్రం భారీగా రాయితీలు ఇవ్వడమే కొంప ముంచుతున్నదని యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వారి వల్ల ఏర్పడిన రెవెన్యూ లోటును పూడ్చుకొనేందుకే మోదీ ప్రభుత్వం ఎల్ఐసీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను తెగనమ్మేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నదని విమర్శించారు. లాభాలు పొందిన కార్పొరేట్ కంపెనీలే తిరిగి ప్రభుత్వరంగ సంస్థలను కొనుగోలు చేసేందుకు మోదీ అవకాశం కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐసీఈయూ యూనియన్ సభ్యులు శర్మ, రమణ, ఇంద్ర, ప్రతిభ సుమరంజిత, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.