రాజన్న సిరిసిల్ల : గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా ఏవిధంగానైతే రూ.5 లక్షలు బీమా అందజేస్తున్నామో అదేవిధంగా చేనేత కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందేలా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని సీఎం ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొని మాట్లాడుతూ..రైతు బీమా మాదిరే రాబోయే రెండు మూడు నెలల్లో చేనేత కార్మికులకు కూడా బీమా ప్రకటిస్తామన్నారు. కార్మికుడు చనిపోతే ఆ కుటుంబం బజారున పడకుండా, వాళ్లు ఏకదమ్ పరేషాన్ కాకుండా వాళ్లకొక ఆధారంగా ఉంటుందన్నారు. కొంత ఊరట ఇస్తుందన్నారు.
చేనేత విషయంలో, మరమగ్గాల విషయంలో కూడా కొంత డబ్బును కార్పస్ ఫండ్గా పెట్టి ప్రభుత్వం ఓ కార్యక్రమం చేపడుతుందన్నారు. అన్ని వృత్తుల మాదిరే చేనేత కార్మికులను కూడా ఆదుకుంటామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఎం వివరించారు. నూలు గానీ, రసాయనాలు గానీ, రంగులు గానీ 50 శాతం సబ్సిడీతో అందజేస్తున్నట్లు చెప్పారు. అందరి మొఖాల మీద చిరునవ్వులు వికసించే తెలంగాణ కావాలని ఆ దిశగా ముందుకు పురోగమిద్దామని సీఎం అన్నారు.