హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కానుకను ప్రకటించింది. రైతు బీమా మాదిరిగానే నేతన్నలకు కూడా బీమా పథకాన్ని ఈ నెల 7వ తేదీ(జాతీయ చేనేత దినోత్సవం) నుంచి అమలుచేయనున్నట్టు చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. నేతన్నల సంక్షేమంకోసం దేశంలో ఎకడాలేని విధంగా ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకాన్ని అమలుచేయనున్నట్టు వివరించారు. బీమా కాలంలో లబ్ధిదారులైన చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నామినీకి రూ.ఐదు లక్షలను అందజేస్తామని పేర్కొన్నారు.
నేతన్న బీమా పథకంపై సోమవారం మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నూతన బీమా పథకాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడుతూ, లబ్ధిదారులు చనిపోతే.. పది రోజుల్లో బీమా మొత్తం వారి ఖాతాలో జమ అవుతుందని చెప్పారు. చేనేత, పవర్లూమ్ కార్మికుల కుటుంబాలకు ఎప్పుడూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారని వెల్లడించారు. ఈ పథకం అమలుకు చేనేత, జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని చెప్పారు. నేతన్న బీమా కోసం ఎల్ఐసీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకొన్నదని చెప్పారు. వార్షిక ప్రీమియం కోసం చేనేత-పవర్లూమ్ కార్మికులు ఒక రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం యాభై కోట్లు కేటాయించామన్న మంత్రి కేటీఆర్.. రూ.25 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని వివరించారు. 60 సంవత్సరాల లోపు ఉన్న చేనేత, మరమగ్గాల కార్మికులందరూ ఈ నేతన్న బీమా పథకానికి అర్హులే అని తెలిపారు. సుమారు 80 వేల చేనేత, మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా కవరేజ్ లభిస్తుందని వివరించారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అర్హులైన చేనేత / పవర్ లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికులందరికీ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు.
ఏటా 1,200 కోట్లు
చేనేత, జౌళి రంగానికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఏ ప్రభుత్వమూ కేటాయించని విధంగా ప్రతి సంవత్సరం ప్రత్యేక బడ్జెట్ (బీసీ వెల్ఫేర్ నుండి) రూ.1,200 కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. చేనేత, జౌళి శాఖ రెగ్యులర్ బడ్జెట్కు ఇది అదనమని వివరించారు. బలహీన వర్గాల సంక్షేమ బడ్జెట్ కింద స్పెషల్ బడ్జెట్ రూపంలో మరో రూ.400 కోట్లు కూడా కేటాయించామని తెలిపారు. చేనేత అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్న వినూత్న పథకాలపట్ల పలు రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయని, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి అధికారుల బృందాలు మన రాష్ట్రంలో పర్యటించి, మన పథకాలను అధ్యయనం చేసి ప్రశంసించాయని పేర్కొన్నారు.
చేనేత మిత్ర
చేనేత కార్మికులకు కాటన్, సిల్, ఉన్ని, నూలు, రంగు రసాయనాల కొనుగోలుపై 40% రాయితీని ప్రభుత్వం ఇస్తున్నది. ఇది కేంద్రం ఇచ్చే 10% రాయితీకి అదనం. ఈ పథకంలో 20,501 మంది లబ్ధిదారులు రూ.24,09,45,220 మేర సబ్సిడీ పొందారు.
నేతన్నకు చేయూత
చేనేత కార్మికుడు చెల్లించే 8 శాతం త్రిఫ్టు పొదుపునకు రాష్ట్ర వాటాగా 16 శాతాన్ని ప్రభుత్వం జమ చేస్తున్నది. ఈ పథకాన్ని జూన్ 24, 2017 నుంచి అమలు చేస్తున్నారు. ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి సమయంలో నేతన్నలను ఆదుకొనేందుకు మూడేండ్ల లాకింగ్ పీరియడ్ నుంచి సడలింపునిస్తూ 20,537 మంది చేనేత కార్మికులకు రూ.96.43 కోట్లు విడుదల చేసింది. ఎన్నో మన్ననలు పొందిన ఈ పథకాన్ని మరో మూడేండ్లు పొడిగిస్తూ ప్రభుత్వం రూ.90 కోట్ల బడ్జెట్ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో 32,328 మంది చేనేత కార్మికులు సభ్యులుగా చేరారు.
మరమగ్గాల కార్మికులకూ చేయూత
నేతన్నకు చేయూత పథకాన్ని మరమగ్గాల కార్మికులకు సైతం అమలుచేస్తున్నారు. కార్మికులు తమ వేతనంలో 8 శాతం జమచేసుకొంటే.. ప్రభుత్వం తన వాటాగా మరో 8% కలుపుతుంది. వీరికి కూడా లాక్ ఇన్ పీరియడ్ నుంచి వెసులుబాటు కల్పించింది. దీంతో 4,301 పవర్లూమ్ కార్మికులకు రూ.12.07 కోట్లమేర లబ్ధి చేకూరింది. వారి అభ్యర్థన మేరకు వచ్చే మూడేండ్లపాటు ఈ పథకాన్ని పొడిగించారు.
రుణ మాఫీ
చేనేత కార్మికుల సామాజిక, ఆర్థిక పరిస్థితులను, మార్కెట్ పోటీని దృష్టిలో ఉంచుకొని రుణ మాఫీ పథకాన్ని ప్రభుత్వం అమలుచేసింది. ఏప్రిల్ 1, 2010 నుంచి మార్చి 31, 2017 వరకు తీసుకొన్న వ్యక్తిగత రుణాలు, వర్కింగ్ క్యాపిటల్ కింద తీసుకొన్న రుణాలలో ఒక్కొక్కరికి రూ.లక్ష వరకు బాకీలను మాఫీ చేశారు. దీనివల్ల 10,148 చేనేత కార్మికులు రూ.28.97 కోట్ల మేర రుణ విముక్తి పొందారు.
పురాతన కళాకృతులకు మళ్లీ జీవం
టెస్కో (తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం)లో ప్రత్యేక ఆర్ అండ్ డీ విభాగాన్ని ఏర్పాటుచేసి చేనేత రంగంలో నూతన డిజైన్లు, వస్త్రోత్పత్తి గురించి పరిశోధనలు, మారెట్పై అధ్యయనం చేపట్టారు. ఇందుకోసం ఇప్పటివరకు రూ.2.85 కోట్లు ఖర్చుచేశారు. ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన చేనేత కళాకృతులను వెలికితీసి వాటికి నవీనరీతులను జోడిస్తున్నారు. పీతాంబరి, ఆర్మూరు పట్టు చీరలు, హిమ్రా చేనేతలు, సిద్దిపేట గొల్లభామ చీరలు వంటి గొప్ప కళాకృతులను పరిశోధించి తిరిగి వెలికితీసి మనుగడలోకి తెచ్చారు. మహాదేవపూర్ ప్రాంత చేనేత కార్మికులతో మహాదేవపూర్ టస్సర్ పట్టుచీరలను అభివృద్ధి చేయించారు. మన రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ గుర్తింపు వచ్చిన కారణంగా రామప్ప పట్టు చీరల సిరీస్ను కూడా రూపొందించారు.
బతుకమ్మ చీరల ఉత్పత్తి
రాష్ట్రంలోని మరమగ్గాల నుంచి బతుకమ్మ చీరల ఉత్పత్తి జరుగుతున్నది. బతుకమ్మ పండగ సందర్భంగా 18 ఏండ్లు నిండిన బీపీఎల్ మహిళలందరికీ ఈ చీరలను కానుకగా ఇస్తున్నారు. ఏటా కోటి చీరల ఉత్పత్తితో యూనిట్ హోల్డర్స్, మరమగ్గాల కార్మికులకు పని కల్పిస్తున్నారు. దీంతో నేత కార్మికుల నెలసరి ఆదాయం రూ.8,000 నుంచి రూ.20,000 వరకు పెరిగింది.
నేతన్న బీమా పట్ల ఎమ్మెల్సీ రమణ హర్షం
నేతన్న బీమా పథకంపట్ల ఎమ్మెల్సీ ఎల్ రమణ హర్షం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగా న్ని ఆదుకొనేందుకు అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతుంటే, కేంద్రం మాత్రం జీఎస్టీ పేరుతో వారిని కోలుకోకుండా చేస్తున్నదని ఆయన విమర్శించారు. చేనేత వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేస్తామన్న మాటకు సీఎం కేసీఆర్ కట్టుబడి.. నేతన్నకు చేయూత సహా అనేక పథకాలను అమలు చేస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా ఎగురవేసే జాతీయ జెండాలను చేనేత ద్వారానే తయారు చేయాలని నిర్ణయించడం వేల కుటుంబాలకు ఆసరా అవుతుందన్నారు. ప్రపంచంలో ఎక్కడా చేనేత బీమా అమలు కావడంలేదని, మొట్టమొదటిసారి తెలంగాణ దీన్ని ప్రవేశపెడుతున్నదని రమణ వివరించారు.