హైదరాబాద్: పద్మ పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వారిని పరిగణనలోకి తీసుకోకపోవడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని చెప్పారు. 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం తెలంగాణకు కనీసం ఐదు అవార్డులు కూడా ఇవ్వలేదన్నారు. ఈమేరకు ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ రాశారు. కాగా, శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలంగాణ నుంచి డాక్టర్ డీ.నాగేశ్వర్ రెడ్డి, మందకృష్ణ మాదిగ మాత్రమే ఉన్నారు.
వారికి అభినందనలు..
పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి ఎంపికైన ప్రముఖులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. వైద్యరంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ డీ. నాగేశ్వర్రెడ్డికి పద్మవిభూషణ్, సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్, ప్రజా వ్యవహారాల విభాగంలో మంద కృష్ణ మాదిగకు, కళలు, సాహిత్యం, విద్యా విభాగాల్లో కేఎల్.కృష్ణ, మాడుగుల నాగఫణిశర్మ, దివంగత మిర్యాల అప్పారావు, రాఘవేంద్రాచార్య పంచముఖిలకు పద్మశ్రీ పురస్కారాలు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. తాము ఎంచుకున్న రంగంలో చేసిన కృషి.. అంకితభావమే వారిని దేశంలోని ఉన్నత పురస్కారాలకు ఎంపికయ్యేందుకు కారణమయ్యాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.