బెజ్జంకి, ఏప్రిల్ 29: దళితులకు ఆర్థిక, సామాజిక వివక్ష నుంచి విముక్తి కల్పించి.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. నిరుపేద దళిత కుటుంబాన్ని ఒక యూనిట్ చేసి వారికి అనుభవం ఉన్న రంగంలో అభివృద్ధి సాధించేందుకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన దళితులు కూలీ స్థాయి నుంచి యజమానులుగా మారారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..
నాడు కూలీని.. నేడు పౌల్ట్రీఫాం యజమానిని
మాది నిరుపేద దళిత కుటుంబం. నేను దినసరి కూలితోపాటు ఆటో డ్రైవర్గా పనిచేసే వాడిని. మాకు వ్యవసాయ భూమి తక్కువగా ఉంది. నా భార్య రాజవ్వతోపాటు కుటుంబసభ్యులందరం కూలి పనికి వెళ్లే వాళ్లం. దళితబంధులో నేను పౌల్ట్రీఫాం యూనిట్ పెట్టుకోగా రూ.10 లక్షలు మంజూరయ్యాయి. మా గ్రామశివారులో మాకున్న భూమిలో 6500 కోడిపిల్లలకు సరిపడేలా పౌల్ట్రీఫాం నిర్మించుకున్న. గత జనవరిలో 5300 బాయిలర్ కోడి పిల్లలను వేసుకున్న. 45 రోజులకు 9 టన్నుల కోళ్లు వచ్చాయి. అన్ని ఖర్చులు పోను రూ.79 వేల ఆదాయం వచ్చింది. మార్చి నెలలో రెండో విడుతగా 4970 కోడి పిల్లలను వేయగా 8 టన్నుల కోళ్లతో రూ.57 వేల ఆదాయం వచ్చింది. మళ్లీ ఈ నెల 22న 5 వేల కోడి పిల్లలను వేసుకున్న. నేను, నా భార్య, కుమారుడు రాకేశ్ ముగ్గురం కలిసి పని చేసుకుంటున్నాం. మాలాంటి నిరుపేద కుటుంబం అభివృద్ధికి నిధులు ఇచ్చిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
–దామెర శ్రీనివాస్, చీలాపూర్పల్లి (దళితబంధు లబ్ధిదారు)
నిరుపేదలకు ఆర్థిక భరోసా
దళితుల అభ్యున్నతి కోసమే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం చీలాపూర్పల్లిలో దళితబంధు యూనిట్లను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మతో కలిసి శనివారం ఆయన సందర్శించారు. చీలాపూర్పల్లికి చెందిన దామోర శ్రీనివాస్ పౌల్ట్రీపామ్, జక్కుల కనుకయ్య పాడిపశువుల షెడ్ను పరిశీలించారు. పౌల్ట్రీపామ్ ఎప్పుడు పెట్టారు? ఈ పథకం ఏ విధంగా ఉపయోగపడుతున్నది? ఈ యూనిట్ వల్ల పొందిన లాభం వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దళితబంధు పథకంలో ఒకరు లేదా జట్టుగా వ్యాపారం చేసుకోవచ్చని, విడతల వారీగా దళితులకు పథకాలు వర్తింపజేస్తామని వినోద్కుమార్ చెప్పారు. దళితులు సంపన్నులు కావాలనే సదుద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు అమలుచేస్తున్నదని తెలిపారు. నియోజకవర్గంలో వంద కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేశామని ఎమ్మెల్యే రసమయి తెలిపారు.
ఆత్మగౌరవంతో బతుకుతున్నాం
మాది చాలా నిరుపేద కుటుంబం. నా భార్యపేరు నాగరాణి. మాకు ఇద్దరు కుమార్తెలు. నేను గ్రామపంచాయతీలో కార్మికుడిగా పనిచేసేవాడిని. నా భార్య కూలిపనికి వెళ్లేది. మా ఇద్దరు బిడ్డలు బడికి వెళ్లేవారు. ప్రభుత్వం మాకు దళితబంధులో రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించింది. ఈ డబ్బులతో పాడిపశువుల యూనిట్ పెట్టుకున్నాం. మాకు ఉన్న కొద్ది భూమిలో బర్రెల కోసం షెడ్ నిర్మించుకున్నాం. 2 నెలల క్రితం బోరు వేసుకొని 4 బర్రెలను కొనుక్కున్నాం. వాటిలో మూడు బర్రెలు సుమారు రోజుకు 20 లీటర్ల పాలు ఇస్తున్నాయి. స్థానిక పాల కేంద్రంలో పోస్తున్నాం. మొదటి నెలకు రూ.20 వేల ఆదాయం వచ్చింది. రానున్న రోజుల్లో కొవ్వుశాతం పెరిగి మరింత ఆదాయం వస్తుంది. ఇంకో బర్రె కూడా ఈతకు వచ్చింది. వీటి కోసం సబ్సిడీపై వచ్చిన జొన్నలతో గడ్డి సాగు చేసుకున్నా. పాడి గేదెల పెంపకం లాభదాయకంగా ఉంది. మాకు దళితబంధు ఇచ్చిన ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు.
–జక్కుల కనకయ్య, చీలాపూర్పల్లి (దళితబంధు లబ్ధిదారు)