దేవరుప్పుల, మార్చి 9 : ‘సీఎం రేవంత్రెడ్డికి రైతుల ఉసురు తాకుతది.. వారిని నిలువునా ముంచుతుండ్రు.. సాగునీరు అందక చేతికొచ్చే పంటలు మట్టి పాలవుతున్నయి.. వెంటనే నీళ్లు వదిలి పంటలను కాపాడుతారా.. ఎండిన పంటలకు నష్ట పరిహారం చెల్లిస్తారా’.. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని మాల్యాతండా, లకావత్ తండా, దుబ్బతండాల్లో సాగునీరు అందక ఎండుతున్న వరి, మక్క పంటలను ఆయన పరిశీలించారు. చేతికొచ్చే దశలో పంటలు ఎండుతున్నాయని గిరిజన రైతులు ఎర్రబెల్లి ముందు కన్నీరు పెట్టగా ఆయన చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్లుండీ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.
ఉత్తమన్నా.. రైతులను కాపాడండి..
ఉత్తమన్నా.. సాగునీరు వదిలి యాసంగి పంటలను కాపాడాలని మంత్రి ఉత్తమకుమార్రెడ్డిని మాజీ మంత్రి ఎర్రబెల్లి ఫోన్లో వేడుకున్నారు. ఎస్సారెస్పీ నీరు వర్ధన్నపేట, రాయపర్తి మండలాలకు రావడంలేదని, దేవాదుల నీరు పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల కాలువల ద్వారా రాకపోవడంతో యాసంగి పంటలు ఎండుతున్నాయని ఉత్తమ్కుమార్రెడ్డికి వివరించారు.