రఘునాథపాలెం, మార్చి 1: ‘పేదల ఇండ్లు కూల్చే హక్కు ఎవరు ఇచ్చారు? అని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాఠోతు హుస్సేన్నాయక్ అధికారులను నిలదీశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదలు కట్టుకున్న ఇండ్లను ప్రభుత్వం ఇటీవల కూల్చిన ఘటనను జాతీయ ఎస్టీ కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా జాతీయ కమిషన్ సభ్యుడు ఆదివారం భూదాన్ భూముల్లో కూల్చివేతలను పరిశీలించారు. బాధితుల గోడు విన్న హుస్సేన్నాయక్.. ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు చెందిన 700 కుటుంబాలను ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు రోడ్డున పడేయడం శోచనీయమని అన్నారు. అదే స్థలంలో ఇండ్లు నిర్మించుకునేలా బాధిత కుటుంబాలకు అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీనిపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వకపోతే అధికారులను ఢిల్లీకి పిలిపిస్తామని హెచ్చరించారు.