హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు రైల్వే కేటాయింపుల్లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం కాజీపేట వ్యాగన్ తయారీ కర్మాగారానికి కేటాయించిన నిధులు, భూసేకరణ, తద్వారా వచ్చే ఉద్యోగాలపై కేంద్ర మంత్రి కచ్చితమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎవరు రైల్వేశాఖ మంత్రిగా ఉంటే వారి రాష్ర్టానికి వీటిని కేటాయిస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టలో పొందుపరిచిన కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీని మాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం, పలు ప్రాజెక్టుల డిమాండ్లను ఆయన వివరించారు. గతంలో కేంద్ర ప్రభుత్వాలు సాధారణ బడ్జెట్ కంటే ఒకరోజు ముందు రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టేవని, దీంతో తమ రాష్ర్టానికి ఎన్ని కొత్త లైన్లు వచ్చాయి? ఎన్ని కొత్త రైళ్లు వచ్చాయి? అనే వివరాలు ప్రజలకు తెలిసేదని చెప్పారు. కానీ, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ను కలిపి ప్రవేశపెడుతున్నదని తెలిపారు. దీంతో రైల్వే బడ్జెట్పై ప్రజలకు ఆసక్తి లేకుండాపోయిందని తెలిపారు. ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మూడు రోజుల తర్వాత దక్షిణ మధ్య రైల్వే అధికారులు పింక్ బుక్ ద్వారా మీడియాకు వివరాలు వెల్లడిస్తేగానీ రాష్ర్టానికి ఏమి వచ్చాయనేది తెలియలేదని చెప్పారు.
కేటాయింపులన్నీ మాయ
ఈ బడ్జెట్లో తెలంగాణకు పెద్దఎత్తున బడ్జెట్ కేటాయించారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారని, కానీ వాస్తవంగా తెలంగాణ ప్రతిపాదించిన ఏ ఒక్క కొత్త ప్రాజెక్టుకుగానీ, రైల్వే లైనుకుగానీ నిధులు కేటాయించలేదని వినోద్కుమార్ వెల్లడించారు. గతంలో కంటే 50 శాతం కేటాయింపులు పెరిగినట్టు అందులో వెల్లడించారని, ఈ కేటాయింపులన్నీ ప్రసుత్తం కొనసాగుతున్న (ఆన్గోయింగ్) ప్రాజెక్టులకే కేటాయించారని వివరించారు. వాస్తవానికి కేంద్రం చేసిన కేటాయింపులన్నీ ఉత్తర-దక్షిణ భారతదేశాన్ని అనుసంధానించే గ్రాండ్ ట్రంక్లైన్ కోసమేనని స్పష్టం చేశారు.
సర్వే పూర్తయిన 15 ఏండ్లకు 10 కోట్లా?
రామగుండం-మణుగూరు కొత్త రైల్వేలైన్ ప్రతిపాదన ఎప్పటిదోనని, తాను 2004లో హన్మకొండ ఎంపీగా ఉన్నపుడు ఆ లైన్ కోసం సర్వే జరిగిందని వినోద్కుమార్ గుర్తుచేశారు. రూ.1900 కోట్లకుపైగా అంచనా వ్యయం ఉన్న ఆ ప్రాజెక్టుకు ఇప్పుడు రూ.10 కోట్లు కేటాయించడం విడ్డూరంగా ఉన్నదని తెలిపారు. మనోహరాబాద్-కొత్తపల్లి లైనుకు రూ.450 కోట్లు కేటాయించారని, ఈ ప్రాజెక్టును కూడా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్నట్టు చెప్పారు. దక్షిణాదిలో కీలకమైన హైదరాబాద్-విజయవాడ-చెన్నై-బెంగళూరు ను అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ ఎందుకు వేయటం లేదని ప్రశ్నించారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే పార్లమెంటులో ఈ డిమాండ్ వినిపించానని గుర్తుచేశారు. జపాన్ నుంచి లక్ష కోట్లు తెచ్చి ఢిల్లీ-అహ్మదాబాద్- ముంబై లైను వేశారేగానీ, దక్షిణాది ప్రస్తావనే తీసుకురావడం లేదని మండిపడ్డారు.
కేంద్రానికి డిమాండ్లు..
హైదరాబాద్ నుంచి నల్లగొండ, సూర్యాపేట, కోదాడ మీదుగా నేరుగా విజయవాడకు రైల్వే లైన్ వేయాలి.
చెన్నై నుంచి విజయవాడ మీదుగా కాజీపేట, హుజూరాబాద్, కరీంనగర్, జగిత్యాల మీదుగా సూరత్ వరకు 170 కిలోమీటర్ల రైల్వే లైను వేయాలి.
ఆదిలాబాద్ వాళ్లు మహారాష్ట్రకు వెళ్లకుండా నేరుగా హైదరాబాద్ చేరుకొనేలా నిజామాబాద్ మీదుగా ఉన్న హైదరాబాద్-నాందేడ్ రైలును ఆర్మూర్, నిర్మల్ మీదుగా అదిలాబాద్ వరకు వేయాలి.
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైను ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ మొత్తం తెలంగాణ ప్రభుత్వమే చేసింది. వంద రూపాయల్లో 33 రూపాయలు రాష్ట్రమే ఖర్చు చేస్తున్నది. 40 కిలోమీటర్లు పూర్తయిన భూసేకరణను సిరిసిల్ల వరకు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తాం. సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు పనులను కేంద్ర రైల్వే శాఖ వెంటనే వేగవంతం చేయాలి.