హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 15 (నమస్తే తెలంగాణ)/బడంగ్పేట: ప్రపంచంలో మహిళతో పెట్టుకున్న వారెవరూ మనుగడ సాధించిన చరిత్ర లేదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్ని రకాల వస్తువుల ధరలను పెంచిన కేంద్రం మహిళల కండ్లల్లో కన్నీరు చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు కత్తి పట్టడం.. యుద్ధం చేయడం.. చీపురు పట్టడం వచ్చు అంటూ గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు తగ్గించకపోతే వారి ఆగ్రహానికి బీజేపీ కుప్పకూలక తప్పదని హెచ్చరించారు.
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని మీర్పేట పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో మహా ధర్నా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ ఒకవైపు సీఎం కేసీఆర్ మహిళల కోసం ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు అందిస్తుంటే మరోవైపు మోదీ ప్రభుత్వం మహిళలకు కష్టాలు తెచ్చి పెడుతున్నదని విమర్శించారు. సీఎం కేసీఆర్ రూ.7289 కోట్లతో ‘మన ఊరు మన బడి’ లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడితే.. దీనికి కేంద్రం రూ.500 కోట్లు కూడా ఇవ్వలేదని మంత్రి సబిత తెలిపారు. కానీ కేంద్ర మంత్రి అమిత్షా మాత్రం సర్వ శిక్షా అభియాన్ కింద నిధులు ఇచ్చిన్నట్టు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. అమిత్షా చెప్పిందే నిజమైతే… బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మన ఊరు మన బడి కార్యక్రమాలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. హరిత హారం, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు కూడా మావేనని కేంద్ర మంత్రి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
మా ఉసురు తగులుతుంది : పద్మ
పెరుగుతున్న ధరలతో కుటుంబ పోషణ భారమవుతున్నది. బీజేపీకి ఓట్లు వేస్తే ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నది. ఏడాదిలో లెక్కలేనన్ని సార్లు ధరలు పెంచారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నది. గ్యాస్ ధరలు పెంచుతున్న మోదీ సర్కార్కు మహిళల ఉసురు తగులుతుంది.
ఎలా బతకాలి : పార్వతమ్మ
చేసిన కష్టం ఒక్క గ్యాస్కే అవుతుంది. బతికేది ఎలా? పిల్లల స్కూలు ఫీజులు ఎలా కట్టాలి? ఏం కొందామన్నా ధరలు మండిపోతున్నాయి. మోదీ సర్కార్ మాలాంటి వారి బతుకులతో చెలగాటమాడుతున్నది. పిల్లలకు ఉద్యోగాలు అన్నారు.. అవి ఇవ్వలేదు. రైతుల ఖాతాలలో డబ్బులు వేస్తామన్నారు.. అవి వేయలేదు. గ్యాస్ ధరలు మాత్రం ఇష్టం వచ్చినట్టు పెంచారు. గ్యాస్ ధర తగ్గించాకే మోదీ, అమిత్ షా తెలంగాణకు రావాలి.