నెక్కొండ, ఏప్రిల్ 26 : కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో తీసుకొచ్చిన పథకం ఇండ్లులేని నిరుపేదల పాలిట శాపంలా మారింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పైలట్ గ్రామంలోనూ ఇండ్ల నిర్మాణం పూర్తికాని పరిస్థితి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసిన బొల్లకొండలో సమయానికి పైసలు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించి 15 నెలలు గడిచినా పట్టుమని పది ఇండ్లు పూర్తికాలేదు. సగం ఇండ్ల పనులు స్లాబ్ దశలోనే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో గోడలకు ప్లాస్టింగ్, పెయింటింగ్ చేసుకోలేకపోయామని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఇంటి నిర్మాణం కోసం లక్షలు అప్పు చేసినా పూర్తి కావడంలేదని కొందరు, భారాన్ని భరించలేమని మరికొందరు లబ్ధిదారులు వాపోతున్నారు.
నిబంధనలు సడలించి ఫైనల్ బిల్లు అందిస్తే ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేసుకుంటామని వేడుకుంటున్నారు. ప్రభుత్వం తమ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయడంతో అందరికీ పక్కా ఇండ్లు వస్తాయని సంబురపడితే చివరికి కన్నీళ్లే మిగిలేలా ఉన్నాయనే లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. గ్రామంలో మొత్తం 99 మందిని లబ్ధిదారులను గుర్తించి, గతేడాది ఇండ్ల నిర్మాణం కోసం ముగ్గులు పోశారు. వాటిలో ఇప్పటివరకు 30 ఇండ్లను మొదలే పెట్టక పోవడం గమనార్హం. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించి 15 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏడు ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఈ ఏడుగురు లబ్ధిదారులు గృహప్రవేశం చేసి ఆరు నెలలు దాటుతున్నా వారికి చివరి బిల్లు ఇంకా రానేలేదు. స్లాబ్దశలో 50, రూఫ్ లెవల్లో 2, బేస్మెంట్ లెవల్లో మరో 10 ఇండ్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి.
పెంకుటిల్లు తీసేసి అప్పు చేసి ఇంటి పనులు మొదలుపెట్టిన. స్లాబ్ పడగా ఒక్క బిల్లే వచ్చింది. ఎవరిని అడిగినా బిల్లు ఎప్పుడు వస్తదో చెప్తలేరు. బిల్లులు వస్తేనే పనులు జేస్తం. ఇల్లచ్చందన్న సుఖం లేదు. పాత ఇల్లు తీసి కొత్తది ఏస్తే అది ఇంకా అయితనేలేదు. పక్కింటోళ్ల జాగలో గూడు వేసుకొని ఉంటున్నం. వానొస్తే ఎక్కడ ఉండాల్నో?
దర్వాజాలు, కిటీకీలు, లెంటల్ లెవల్ దాకా పనిజేసినం. అప్పు సప్పు చేసి మెల్లమెల్లగా కట్టుకుంటున్నాం. ఒక్కటే బిల్లు వచ్చింది. బిల్లులు వస్తేనే పనులు జేస్తం. లేకపోతే కష్టమే.
కొడుకు ఇల్లు కట్టుకొని ఆర్నెల్లయింది. ఇంకా ఆఖరి బిల్లు రాలే. ఎప్పుడు వస్తదో తెల్వదు. బిల్లుకోసం చూస్తూనే ఉన్నం.