చిక్కడపల్లి, ఫిబ్రవరి 15: దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీకి పట్టిన గతే బీజేపీ నేతృత్వంలోని మోదీ చీకటి పరిపాలనకూ పడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం హెచ్చరించారు. హిండెన్బర్గ్ వెల్లడించిన అదానీ ఆర్థిక అవకతవకలపై కేంద్ర సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే అదానీ, మోదీల బంధాన్ని బహిర్గతం చేస్తున్నదని తెలిపారు. సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం చిక్కడపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎల్ఐసీ, ఎస్బీఐ నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొని అదానీ సంస్థలు కృత్రిమలాభాలను చూపిస్తున్నామని తెలిపారు. అదానీ దేశ సంపదను దోపిడీ చేయడం కూడా దేశం కోసమేనా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి ప్రయత్నించిన ఎవరైనా కాలగర్భంలో కలిసి పోవాల్సిందనని, ఇదే గతి బీజేపీకి కూడా పడుతుందని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డీజీ నరసింహారావు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.