హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్జెండర్స్ సంక్షేమం కోసం ప్రభుత్వం స్వతంత్రశాఖను ఏర్పాటుచేసింది. ఈ మేరకు మహిళా, శిశుసంక్షేమశాఖ నుంచి వేరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త శాఖకు దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్జండర్ల సాధికారత సంస్థగా నామకరణం చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖలో వికలాంగుల సంక్షేమశాఖను గతంలో ప్రభుత్వం విలీనం చేసింది. రెండు శాఖల్లో భిన్న పథకాల అమలు, వాటిలోనూ వ్యత్యాసం ఉండటంతోపాటు అంతర్గత నియమావళి కూడా విభిన్నంగా ఉన్నది.
దీంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దివ్యాంగుల సంపూర్ణ సాధికారత కోసం ఆ శాఖను స్వతంత్రశాఖగా ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. దివ్యాంగుల రాష్ట్ర సలహా మండలి కూడా ప్రభుత్వానికి ఈ మేరకు సూచన చేసింది. దీంతో దివ్యాంగుల విజ్ఞప్తులపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నది. దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్జెండర్ల సాధికారత సంస్థకు ప్రత్యేకంగా జిల్లా అధికారిని నియమించనున్నారు. అందుబాటులో ఉన్న క్యాడర్ స్ట్రెంత్ పునఃపంపిణీ ఉత్తర్వులను త్వరలో జారీ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అప్పటివరకు మహిళా, శిశు సంక్షేమం.. వికలాంగుల సంక్షేమం మధ్య వరింగ్ అరేంజ్మెంట్ చేయనున్నట్టు తెలిపింది.
సత్వర నిర్ణయాలు తీసుకొనే వెసులుబాటు
దివ్యాంగులశాఖను స్వతంత్ర శాఖగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తంచేశారు. ఈ శాఖకు స్వయం ప్రతిపత్తి కల్పించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో దివ్యాంగుల సంక్షేమం కోసం సత్వర నిర్ణయాలు తీసుకొనే వెసులుబాటు కలగుతుందని సంతోషం వ్యక్తంచేశారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవానికి ఒకరోజు ముందుగానే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంపై హర్షం వ్యక్తంచేశారు.
దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి కొనియాడారు. దివ్యాంగుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అనేక సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని, దివ్యాంగులశాఖను స్వతంత్రశాఖగా గుర్తించడమే దీనికి నిదర్శనమని ఉదహరించారు. దివ్యాంగులశాఖను స్వతంత్రశాఖగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, అందుకు కృషి చేసిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్రావు, కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమభవన్లో పటాకులు కాల్చి సంబురాలు చేసుకొన్నారు. కార్యక్రమంలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ, ప్రభంజన్రావు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమశాఖ రాష్ట్ర సలహా మండలి సభ్యుడు నాగేశ్వర్రావు, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జెర్రిపోతుల పరశురాం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
నేడు రవీంద్రభారతిలో ఘనంగా దివ్యాంగుల దినోత్సవం
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం నిర్వహించనున్నారు. ఈ మేరకు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తోపాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు.
దివ్యాంగుల కోసం దేశంలోనే తొలి మొబైల్ యాప్
దివ్యాంగుల కోసం దేశంలోనే తొలి మొబైల్ యాప్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. 32 వీడియోలతో 150 నిమిషాల నిడివితో ఈ యాప్ను రూపొందించారు. రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమశాఖ, దేశీ నేషన్ ఎడ్యుకేట్ సంస్థ సహకారంతో ఈ యాప్ను రూపొందించారు. ఈ యాప్ను శుక్రవారం హైదరాబాద్లోని స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్, వికలాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ, దేశీ నేషన్ సంస్థ సీఈవో ఎస్వీ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.