హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): గాలిదూరని చోటు లేనట్టే.. ప్రపంచంలో భారతీయులు లేని దేశం ఉండదు అనడం అతిశయోక్తి కాదు. చిన్నా.. పెద్దా తేడా లేకుండా దాదాపు అన్ని దేశాల్లో మనవాళ్లు కాళ్లుమోపారు. ప్రపంచంలో 193 దేశాలు ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి చెప్తున్నది. ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో, వ్యాపారం కోసమో.. ఇలా కారణం ఏదైనా మనవాళ్లు దాదాపు అన్ని దేశాల్లో తిష్ఠవేశారు. ఇదొక్కటే మనం సాధించిన ఘనత అని సంబురపడితే మీరు పప్పులో కాలేసినట్టే. కొత్తకొత్త దేశాలకు వెళ్లడమే కాదు.. అక్కడ నేరాలు చేసి జైళ్లకు వెళ్లడంలోనూ మనవాళ్లు ఘనులేనట. ఎందుకంటే.. ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో మన భారతీయులు కారాగారవాసం చేస్తున్నారట. ఆయా జైళ్లలో మొత్తం 9,521 మంది భారతీయులు మగ్గుతున్నారట. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ వివరాలను తాజాగా వెల్లడించింది. ఇన్నాళ్లూ మనం అరబ్ దేశాలకు వలస వెళ్లినవాళ్లో, అక్రమంగానో, అనుకోకుండానో పాకిస్థాన్, శ్రీలంకకు చేరినవాళ్లో, అమెరికా, బ్రిటన్ వంటిదేశాల్లోనూ మన భారతీయులు ఊచలు లెక్కపెడుతుండొచ్చు అని భావిస్తుంటాం. కానీ, కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం మనవాళ్లు నేరం చేయడానికి చిన్నాపెద్దా.. పేద, ధనిక.. దగ్గర, దూరం అనే తేడాలేమీ చూపించలేదని స్పష్టమవుతున్నది.
సౌదీఅరేబియాలో అత్యధికం
కేంద్రం నివేదిక ప్రకారం ఎక్కువగా అరబ్ దేశాల జైళ్లలోనే భారతీయులు చిక్కుకున్నారు. సౌదీఅరేబియా జైలులో 2,200 మంది ఉన్నారు. దుబాయ్ (యూఏఈ) జైలులో 2,143 మంది మగ్గుతున్నారు. 1227 మంది భారతీయ ఖైదీలతో నేపాల్ మూడో స్థానంలో ఉన్నది. పాకిస్థాన్ జైళ్లలో 308, చైనాలో 180 మంది ఉన్నారు. ఎడారి దేశాలు ఖతార్ (752), కువైట్ (410), బహ్రెయిన్ (310), ఒమన్ (135) టాప్లోనే ఉన్నాయి.టోగో, మొజాంబిక్, గ్వాటెమాలా, అంగోలా, రువాండా, మాల్టా, ఐవరీకోస్ట్, సైప్రస్ వంటి పెద్దగా గుర్తింపు లేని దేశాల్లోని జైళ్లలో కూడా మనోళ్లు ఉన్నారు. అమెరికా, ఇంగ్లాండ్, ఇటలీ, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్ వంటి ధనిక దేశాల్లోనే కాదు.. జింబాబ్వే, నైజీరియా, టాంజానియా వంటి పేద దేశాల్లో జైలు కూడు తింటున్నారు.